- 15 రోజులైనా సగం సెంటర్లు కూడా తెరవలే
- ఇప్పటి వరకు కొన్నది లక్షా20 వేల టన్నులు
- టార్గెట్లో కేవలం ఒక్క శాతమే
- ఆరేడు జిల్లాల్లో మినహా అంతటా జాప్యం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర సర్కారు వడ్ల కొనుగోళ్లు షురూ చేసినట్టు చెప్తున్నా..21 జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క సెంటర్ కూడా చాల్ గాలే. 15 రోజులైనా కనీసం సగం సెంటర్లలో కూడా కొనుగోళ్లు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. అక్టోబర్ ప్రారంభం నుంచే వరి కోతలు మొదలు కాగా.. సర్కారు గత నెల 22 నుంచి కొనుగోళ్లు స్టార్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకు 21జిల్లాల్లో ఒక్క సెంటర్ తెరువలేదు. సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా 6,713 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి ఒక కోటి 12 లక్షల 34 వేల టన్నులు వడ్లు కొనాలని ప్రణాళికలు చేసింది. కానీ, ఇప్పటి వరకు 11 జిల్లాల్లో కేవలం 2,257 సెంటర్లు మాత్రమే తెరిచింది. తెరిచిన సెంటర్ల నుంచి ఇప్పటి వరకు రూ.248.16 కోట్ల విలువైన 1.21 లక్షల టన్నుల వడ్లు మాత్రమే కొన్నరు. ఇలా ఆరేడు జిల్లాలు మినహా అంతటా జాప్యమే జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి.
పదకొండు జిల్లాల్లోనే కొనుగోళ్లు..
రాష్ట్రంలో 14 జిల్లాల్లో వడ్ల కొనుగోలు కోసం సెంటర్లు ఓపెన్ చేసినా నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్, యాదాద్రి తదితర 11 జిల్లాల్లో మాత్రమే కొనుగోళ్లు జరుగుతున్నాయి. నిజామాబాద్లో 458 సెంటర్లు తెరిచి.. అత్యధికంగా 10 లక్షల టన్నుల వడ్లు కొనాలని అధికారులు ప్లాన్ చేశారు. కానీ, ఇప్పటి వరకు 446 సెంటర్లు మాత్రమే తెరిచి 62,443 టన్నుల వడ్లు మాత్రమే కొన్నారు. కామారెడ్డిలో 345 సెంటర్ల ద్వారా 6 లక్షల 10 వేల టన్నులు కొనాలని ప్లాన్ చేసి ఇప్పటి వరకు 305 సెంటర్లు ఓపెన్ చేసి 13,564 టన్నలు కొన్నరు. మెదక్ జిల్లాలో 346 సెంటర్లకు గాను 296 సెంటర్లు ఓపెన్ చేసి 8,888 టన్నులు కొనుగోలు చేశారు. సంగారెడ్డిలో 155 సెంటర్లు ఓపెన్ చేసి 2.52 లక్షల టన్నుల ధాన్యం కొనసాలని సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ అంచనా వేయగా.. ఇప్పటి వరకు 7,338 టన్నుల ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. నల్గొండ జిల్లాలో 237 సెంటర్లు తెరిచి 7 లక్షల టన్నులు కొనాలని ప్రణాళికలు చేసింది. ఇప్పటి వరకు 176 సెంటర్లలో కొనుగోళ్లు ప్రారంభించి రైతుల నుంచి 16,113 టన్నుల ధాన్యం కొనగోళ్లు చేపట్టింది. కరీంనగర్ జిల్లాలో 4.46 లక్షల టన్నులు టార్గెట్ పెట్టుకోగా ఇప్పటి వరకు 2,692 టన్నులు కొన్నారు. యాదాద్రి జిల్లాలో 6 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటి వరకు 8,637టన్నులు కొన్నారు. జగిత్యాల జిల్లాలో 6.51లక్షల టన్నుల టార్గెట్లో 70 టన్నులే కొనుగోళ్లు జరిపారు. సిరిసిల్లలోనూ 3.5 లక్షల టన్నుల టార్గెట్లో 227 టన్నులు కొనుగోళ్లు చేశారు. తక్కువ వరి పంట సాగైన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11 సెంటర్లలో 30 వేల టన్నుల వడ్లు కొనాలని అంచనా వేశారు. రెండు సెంటర్లు ఓపెన్ చేసి 552 టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిపారు. 11 జిల్లాల్లోని సెంటర్ల నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.248.16 కోట్ల విలువైన లక్షా 20 వేల 598 టన్నుల వడ్లు మాత్రమే కొన్నరు.
ఆ జిల్లాల్లో ఇంకెప్పుడు కొంటరో..
రాష్ట్రంలో 32 జిల్లాల్లో వడ్లు కొనుగోలు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 11 జిల్లాల్లో కొనుగోళ్లు చాల్ కాగా.. మరో 21 జిల్లాల్లో ఇంకా ఒక్క సెంటర్లో కూడా కొనుగోళ్లు షురూ చేయలేదు. సూర్యాపేట, పెద్దపల్లి, నిర్మల్ జిల్లాల్లో సెంటర్లు తెరిచినా వివిధ కారణాలతో కొనుగోళ్లు షురూ చేయలేదు. వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట్, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, జనగాం, మహబూబాబాద్, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, మంచిర్యాల, ఆసీఫాబాద్, ఆదిలాబాద్ తదితర 21 జిల్లాల్లో ఒక్క సెంటర్ కూడా చాల్ చేయలేదు. ఈ జిల్లాల్లో ఇంకెప్పుడు మొదలు పెడుతారోనని రైతులు ఎదురు చూస్తున్నారు.