
ఇస్లామాబాద్: దేశం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నందున డిఫెన్స్ బడ్జెట్ ను తగ్గించుకోవాలని పాకిస్థాన్ ఆర్మీ నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) డీజీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘దేశ రక్షణ, సెక్యూరిటీ విషయంలో ఎలాంటి రాజీ లేదు. అన్ని ముప్పులను సమర్థంగా ఎదుర్కొంటాం’ అని అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సైన్యం స్వచ్ఛందంగా బడ్జెట్ తగ్గించుకోవడాన్ని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మెచ్చుకున్నారు. సెక్యూరిటీపరంగా ఆర్మీ అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నా.. స్వచ్ఛందంగా ముందుకొచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు. రక్షణ శాఖలో మిగిలిన నిధులను గిరిజన ప్రాంతాలు, బలూచిస్థాన్ అభివృద్ధికి వాడతామన్నారు.
2019––20 సంవత్సరానికి ఈ నెల 11న బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని, ప్రభుత్వ సంస్థలు, సైన్యం కూడా పొదుపు చర్యలు పాటించాలని గత నెల ఇమ్రాన్ ఖాన్ సర్కారు విజ్ఞప్తి చేసింది. వచ్చే బడ్జెట్ లో పొదుపు చర్యలు ఉంటాయని, ప్రభుత్వ వ్యయాన్ని సాధ్యమైనంతవరకు తగ్గిస్తామని పాకిస్థాన్ ప్రధాని ఆర్థిక వ్యవహారాల సలహాదారు హఫీజ్ షేక్ అన్నారు. 2018లో డిఫెన్స్ ఖర్చుల్లో ప్రపంచంలోనే పాకిస్థాన్ 20వ దేశంగా నిలిచిందని స్వీడన్ కు చెందిన స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిప్రి) గతనెల చెప్పింది.