- పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్
పెషావర్: పాకిస్తాన్ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) ఆర్థిక సాయం కోసమే ఎదురు చూస్తున్నామని ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ అన్నారు. ఐఎంఎఫ్ పెడుతున్న కండీషన్లు చాలా కష్టంగా ఉన్నాయని, ఊహకు కూడా అందవని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని షరీఫ్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘ఆర్థిక మంత్రి ఇషాక్ దర్కు ఐఎంఎఫ్ను ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంది. ఐఎంఎఫ్ చెప్పిన కండీషన్లను రీచ్ అవడం మా శక్తికి మించిన పనిగా అనిపిస్తున్నది. మాకు వేరే చాన్స్ లేదు. అందుకే ఐఎంఎఫ్ రూల్స్ పాటించాల్సిందే.. వివరాలు వెల్లడించలేను. దేశంలో ఆర్థిక పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది” అని ప్రధాని షరీఫ్ అన్నారు.
అంగీకరించకపోతే ప్యాకేజీ కష్టం
నెలల తరబడి నిలిచిపోయిన ఆర్థిక సాయాన్ని మళ్లీ ప్రారంభించేందుకు ఐఎంఎఫ్ టీం మంగళవారం పాకిస్తాన్కు వచ్చిందని ప్రధాని షరీఫ్ తెలిపారు. అక్టోబర్లో నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఐఎంఎఫ్ విధించిన షరతులు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని చెప్పారు. పన్నులు పెంచాలని, సబ్సిడీలకు కోతలు విధించాలనే కండీషన్లు పెడుతున్నదని వివరించారు. దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, అయినా ఐఎంఎఫ్ వెనక్కి తగ్గడం లేదన్నారు. అంగీకరించకపోతే బెయిల్ఔట్ ప్యాకేజీ కష్టమని చెబుతున్నదని తెలిపారు. కరెంట్ చార్జీలు పెంచాలనే ప్రతిపాదన తమ ముందు ఉంచిందని వివరించారు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పాక్వద్ద విదేశీ మారక నిల్వలు 3.1 బిలియన్ డాలర్లే ఉన్నాయి. బుధవారానికి ఇన్ఫ్లేషన్ 48 ఏండ్ల గరిష్టానికి చేరుకుంది. 7 బిలియన్ డాలర్ల అప్పు ఇచ్చేందుకు ఐఎంఎఫ్ సిద్ధంగానే ఉన్నా... అందుకు తగిన అర్హతలు పాక్కు ఉన్నాయా.. లేదా.. అని సమీక్షిస్తున్నది. ఈ లోన్ ఇచ్చేందుకు ఇప్పటికే 8సార్లు ఐఎంఎఫ్ టీం పాక్కు వచ్చి వెళ్లింది. తాజాగా మళ్లీ మంగళవారం పాక్కు వచ్చి తొమ్మిదో సారి సమీక్ష జరుపుతున్నది.