భారత్తో జరిగిన మూడు యుద్ధాల తర్వాత పాక్ గుణపాఠం నేర్చుకుందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. స్వాతంత్య్రానంతరం జరిగిన మూడు యుద్ధాలతో పేదరికం, నిరుద్యోగం పెరిగిందే తప్ప తమ దేశానికి ఒరిగిందేమి లేదన్నారు. అల్ అరేబియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం తాము భారత్ తో శాంతి కోరుకుంటున్నట్లు చెప్పారు.
మోడీతో చర్చలకు సిద్ధం..
పాక్ శాంతి కోరుకుంటోందని, కశ్మీర్ పరిణామాలను భారత్ నియంత్రించాలని షెహబాజ్ షరీఫ్ ప్రధాని మోడీని కోరారు. నిత్యం రగులుతున్న కశ్మీర్ అంశంపై రెండు దేశాలు కుర్చోని మాట్లాడుకోవాలని అన్నారు. ఈ విషయంలో మోడీతో చర్చలకు సిద్ధమని చెప్పారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటే రెండు దేశాలు పురోగమిస్తాయని ఆకాంక్షించారు. బాంబులు, ఆయుధాలు, అణుబాంబులపై నిధుల్ని వృథా చేయాలనుకోవడం లేదని పాక్ ప్రధాని స్పష్టంచేశారు.