స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కి బెదిరింపు కాల్ వచ్చింది. లోన్ ఇవ్వకపోతే బ్యాంకు ఛైర్మన్ ను కిడ్నాప్ చేసి, మర్డర్ చేస్తామని హెచ్చరించాడు. దీనికి సంబంధించిన మొత్తం 2 ఫోన్ కాల్స్ కు అందుకున్న ఎస్బీఐకి తాను పాకిస్తాన్ కి చెందిన వ్యక్తిగా చెప్పుకున్నాడు. తనకు రూ.10 లక్షల రుణం మంజూరు చేయాలని, లేకుంటే బ్యాంకు ఛైర్మన్ దినేశ్ ఖారాను అపహరించి, హతమారుస్తామని బెదిరించాడు.
దీంతో పాటు బ్యాంకు కార్పొరేట్ కార్యాలయాన్ని పేల్చేస్తానంటూ హెచ్చరించాడు. ఈ మేరకు ముంబయిలోని నారీమన్ పాయింట్లో ఉన్న ఎస్బీఐ ఛైర్మన్ పర్సనల్ పీఏ కార్యాలయానికి బుధవారం ఫోన్ వచ్చింది. ఈ విషయమై బ్యాంక్ సెక్యూరిటీ మేనేజర్ అజయ్ కుమార్ శ్రీవాస్తవ.. మెరైన్ డ్రైవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ బెంగాల్ నుంచి ఈ కాల్ వచ్చినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు ఓ బృందాన్ని అక్కడికి పంపారు.