
అడ్డాకుల, వెలుగు: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో రైతులు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని పాలమూరు కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. మూసాపేట్ మండలం నిజాలాపూర్, మహమ్మద్ హుస్సేన్ పల్లి గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో పాల్గొని రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్, హెల్ప్ డెస్క్, దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ వద్ద సౌలతులు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలించి, పలు సూచనలు చేశారు.
రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం
మహబూబ్ నగర్ కలెక్టరేట్: అత్యవసర పరిస్థితుల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలు అభినందనీయమని కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం, ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజ్ అధ్యక్షతన కలెక్టరేట్లో జరిగిన యూత్ రెడ్ క్రాస్, జూనియర్ రెడ్ క్రాస్ స్వచ్ఛంద సేవకులు, తలసేమియా బాధితుల సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. తలసేమియా పోస్టర్ను ఆవిష్కరించారు. జిల్లాలో రెడ్ క్రాస్ సేవలను మరింత మెరుగు పర్చాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు, శామ్యూల్, జగపతి రావు, జి.రమణయ్య పాల్గొన్నారు.