- నోటిఫికేషనే తరువాయి
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో 532 పంచాయతీలు, 4,656 వార్డులకు రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాయి. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీలకు ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బీసీ గణన ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. ఏ పంచాయతీ ఏవరికి రిజర్వు కానుందనేది ఇప్పటికే అధికారులు ఫైనల్ చేశారు. ఆదివారం 50 శాతం మహిళలకు సంబంధించి రిజర్వేషన్లను నాయకుల సమక్షంలో డ్రా తీశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడల్లో ఆర్డీవోల సమక్షంలో ఆయా డివిజన్ల సర్పంచ్లకు మహిళలకు కేటాయించే వాటిని డ్రా తీశారు.
సర్పంచ్ రిజర్వేషన్లను ఆర్డీవోలు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లను ఎంపీడీవోలు ఫైనల్ చేశారు. ఆయా గ్రామాల రిజర్వేషన్లు ఫైనల్ అయినప్పటికీ అధికారులు మాత్రం అధికారికంగా వెల్లడించట్లేదు. జిల్లాలో 532 పంచాయతీల్లో ఎస్సీలకు 79, ఎస్టీలకు 91 రిజర్వు కానున్నాయి. కలెక్టర్ ఫైనల్ చేసి పంచాయతీ రాజ్ కమిషనర్కు పంపనున్నారు. ప్రభుత్వం గెజిట్ ఇచ్చి ఎన్నికల కమిషన్కు వివరాలు పంపనుంది. ఆ తర్వాత షెడ్యూల్ విడుదల అవుతుంది. ఫైనల్ ఓటర్ లిస్టును కూడా ప్రకటించారు. పల్లెల్లో పంచాయతీ ఎన్నికల పోరు కు సంబంధించి వాతవరణం వేడెక్కుతోంది.
