
ముంబై: ఇంగ్లండ్ టూర్లో తీవ్ర గాయానికి గురైన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వచ్చే నెలలో సొంతగడ్డపై వెస్టిండీస్తో జరిగే టెస్టు సిరీస్లో ఆడే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. పంత్ గాయం నుంచి కోలుకొని తిరిగి ఫిట్నెస్ అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అక్టోబర్ 2వ తేదీ అహ్మదాబాద్లో విండీస్తో తొలి టెస్టు మొదలవనుంది. ఆ లోపు ఫిట్నెస్ అందుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. కుడి కాలు పాదానికి సర్జరీ చేయించుకొని వచ్చిన తర్వాత ముంబైలో మెడికల్ స్పెషలిస్ట్లను సంప్రదించాడు.
‘వెస్టిండీస్ సిరీస్తో తిరిగి గ్రౌండ్లోకి రావాలని పంత్ టార్గెట్గా పెట్టుకున్నాడు. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం అయ్యేలా లేదు. పంత్ తన శాయశక్తులా కృషి చేస్తున్నప్పటికీ ఈ సిరీస్లో ఆడే అవకాశాలు యాభై శాతమే అనొచ్చు. కాబట్టి అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్తోనే అతను రీఎంట్రీ ఇచ్చే చాన్సుంది. పంత్ పాదానికి ఇంకా కట్టు ఉంది. అతను నెట్స్కు వచ్చి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడానికి మరో రెండు వారాల సమయం అయినా పడుతుంది’ అని పంత్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఇంగ్లండ్తో నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో క్రిస్ వోక్స్ బాల్ తగిలి పంత్ పాదం ఎముక విరిగింది. నొప్పిని భరిస్తూనే రెండో ఇన్నింగ్స్లోనూ తను బ్యాటింగ్ చేశాడు. ఈ కారణంగా అతను కోలుకోవడం ఆలస్యం అవుతోందని తెలుస్తోంది. ‘సాధారణంగా ఇలాంటి ఫ్రాక్చర్స్ నయం కావడానికి ఆరు వారాలు పడుతుంది. ఆపై ఫిట్నెస్ అందుకునేందుకు మరో రెండు వారాలు అవసరం అవుతుంది. ఒకవేళ గాయం అయిన వెంటనే విశ్రాంతి తీసుకోకుండా అలానే పరుగెత్తితే అది కోలుకునే సమయాన్ని మరింత ఆలస్యం చేస్తుంది’ అని ఓ వర్గం తెలిపింది. ఈ గాయం అయిన తర్వాత పంత్ ఆటకు దూరంగా ఉన్నాడు. ఇంగ్లండ్తో ఐదో టెస్టు నుంచి తప్పుకున్న రిషబ్ ఆసియా కప్కు కూడా ఎంపిక కాలేదు. పంత్ ఫిట్నెస్ అందుకుంటేనే తిరిగి బరిలోకి దిగేందుకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ నుంచి అనుమతి లభిస్తుంది. దానికి ఎంత సమయం పడుతుందో చూడాలి.