IPL 2024: 20 కోట్ల ఆటగాడికే ఓటు: సన్ రైజర్స్ కొత్త కెప్టెన్‌గా కమ్మిన్స్

IPL 2024: 20 కోట్ల ఆటగాడికే ఓటు: సన్ రైజర్స్ కొత్త కెప్టెన్‌గా కమ్మిన్స్

ఐపీఎల్ 2024 సీజన్ లో ప్రారంభం కావడానికి మరో 20 రోజుల ముందు సన్ రైజర్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ను సన్ రైజర్స్ సారధిగా అధికారికంగా ప్రకటించింది. గత రెండు సీజన్ లుగా మార్కరం కెప్టెన్సీలో హైదరాబాద్ జట్టు ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది. ప్లే ఆఫ్ సంగతి పక్కన ఉంచితే కనీసం ఆ దిశగా కూడా అడుగులేయలేదు. దీంతో ఐపీఎల్ మినీ వేలంలో 20.5 కోట్లకు అమ్ముడుపోయిన కమ్మిన్స్ పై నమ్మకముంచి అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

పాట్ కమ్మిన్స్ ఐపీఎల్ 2023 మినీ వేలంలో రికార్డ్ ధరకు అమ్ముడయ్యాడు. కనీస ధర రూ. 2 కోట్లతో ఈ ఆసీస్ కెప్టెన్ వేలం ప్రారంభం కాగా..సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్లు వెచ్చించి అతన్ని దక్కించుకుంది. కమిన్స్ ను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న హైదరాబాద్ సన్ రైజర్స్.. బెంగళూరుపై పోటాపోటీగా వేలం పాల్గొన్నది. కమ్మిన్స్ కోసం అసలు వెనక్కి తగ్గని సన్ రైజర్స్ ఆక్షన్ లో భారీ ధరకు సొంతం చేసుకుంది. 

స్టార్ ప్లేయర్ అయినప్పటికీ.. ఒక ఫాస్ట్ బౌలర్ కోసం 20 కోట్లకు పైగా వెచ్చించడం అనవసరమనే అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. అయితే కమ్మిన్స్ ను SRH యాజమాన్యం అంత పిచ్చిగా ఏమీ కొనలేదని అర్ధమవుతుంది. గత సీజన్ లో హైదరాబాద్ జట్టు చెత్త ప్రదర్శనతో నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. 14 మ్యాచ్ ల్లో కేవలం 4 మ్యాచ్ ల్లోనే గెలిచి 10 ఓడిపోయింది. ఈ ఓటమికి కెప్టెన్ మార్కరం అనుభవం లేని తనం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారణంగానే కమిన్స్ ను కెప్టెన్ గా తీసుకున్నట్లుగా అర్ధమవుతుంది. 

కమ్మిన్స్ అంతర్జాతీయ క్రికెట్ లో విజయవంతమైన కెప్టెన్ గా పేరుంది. 2023 లో ఆస్ట్రేలియాకు టెస్ట్ ఛాంపియన్ షిప్ తో పాటు, భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ ను ఆసీస్ కు అందించాడు. పదునైన పేస్ బౌలింగ్ వేయడంతో పాటు లోయర్ ఆర్డర్ లో హిట్టింగ్ చేయగల సామర్ధ్యం ఉంది. కమ్మిన్స్ సన్ రైజర్స్ కెప్టెన్ అయితే ఇక తిరుగుండదు. కెప్టెన్ కోసమే కమ్మిన్స్ కు భారీ ధర వెచ్చించారని స్పష్టంగా అర్ధం అవుతుంది. 

Also Read : IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. గాయంతో స్టార్ ఓపెనర్ ఔట్
 

మార్కరం అద్భుతంగా ఆడుతున్నా.. దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో వరుసగా రెండు టైటిల్స్ అందించినా.. అనుభవం లేకపోవడం, ఒత్తిడిలో జట్టును నడిపించలేకపోవడం ప్రతికూల అంశాలుగా మారాయి. ఐపీఎల్ 2024కు ఈ సఫారీ ఆటగాడిపై నమ్మకం చూపించలేదు.