
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేటను పర్యాటక రంగంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట మినీ ట్యాంక్ బండ్ ను హైదరాబాద్ చెందిన ఆర్కిటెక్ బృంద సభ్యులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పటేల్ రమేశ్ రెడ్డి మాట్లాడుతూ మినీ ట్యాంక్ బండ్ వద్ద రూ.10 కోట్లతో టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఐదెకరాల స్థలంలో అద్భుతమైన పార్కును ఏర్పాటు చేస్తామన్నారు.
ఇందుకోసం హైదరాబాద్ నుంచి ప్రముఖ ఆర్టిటెక్చర్ తో కలిసి చర్చించామని, గతంలో ఈ ఆర్కిటెక్చర్ బృందం హైదరాబాద్లోని ఫ్లై ఓవర్ పెయింటింగ్స్, ఫ్లవర్ ప్లే గ్రౌండ్స్, బాస్కెట్ బాల్ కోర్ట్స్ వంటి అనేక ప్రాజెక్టులకు డిజైన్లను అందించారని తెలిపారు. పార్కుతోపాటు కేబుల్ బ్రిడ్జిని కూడా నిర్మాణం నిర్మిస్తామని చెప్పారు. త్వరలో నిధులు కేటాయించి రాష్ట్రంలోనే ప్రత్యేకత కలిగిన పార్కును సూర్యాపేటలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.