పేటీఎం నష్టం రోజుకి రూ.11 కోట్లు

పేటీఎం నష్టం రోజుకి రూ.11 కోట్లు

గూగుల్ పే, ఫోన్‌‌పేల నుంచి పోటీ తీవ్రం

వన్‌‌97 కమ్యూనికేషన్స్ నికర నష్టాలు

    2019 ఆర్థిక సంవత్సరంలో.. రూ.3,959.6 కోట్లు

    2018 ఆర్థిక సంవత్సరంలో.. రూ.1,490 కోట్లు

కన్సాలిడేటెడ్ బేసిస్‌‌లో నష్టాలు..

    2019 ఆర్థిక సంవత్సరంలో..రూ.4,217 కోట్లు

    2019 ఆర్థిక సంవత్సరంలో.. రూ.1,604 కోట్లు

    పేటీఎం మనీ నష్టాలు రూ.36.8 కోట్లు

     ఐపీఓకి ముందే మరింత మనీ సేకరణ.. పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ

 

మరోవైపు డిజిటల్ పేమెంట్స్‌‌ లావాదేవీల్లో బాగా పేరుగాంచిన పేటీఎం నష్టాలు భారీ ఎత్తున పెరిగాయి. గత ఏడాది పేటీఎం నష్టాలు 165 శాతం పెరిగినట్టు కంపెనీ షేర్‌‌‌‌హోల్డర్స్‌‌తో పంచుకున్న వివరాల్లో వెల్లడైంది. ఇదే సమయంలో రెవెన్యూలు స్వల్పంగా మాత్రమే పెరిగాయి. డిజిటల్ పేమెంట్స్‌‌ లో లీడర్‌‌‌‌గా ఉన్న పేటీఎంకి గూగుల్‌‌ పే, ఫోన్‌‌పేల నుంచి పోటీ తీవ్రతరమవుతుండటంతో, నష్టాలు పెరిగిపోతున్నాయి. 2019 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పేటీఎం పేరెంట్ కంపెనీ వన్‌‌97 కమ్యూనికేషన్స్‌‌ రూ.3,959.6 కోట్ల నికర నష్టాలను పోస్ట్ చేసింది. అంతకుముందు ఏడాదిలో ఈ నష్టాలు రూ.1,490 కోట్లుగా ఉండేవి. 2017–18లో రూ.3,229 కోట్లుగా ఉన్న కంపెనీ స్టాండలోన్ రెవెన్యూ 2018–19 ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి రూ.3,319 కోట్లకు చేరుకుంది.

పేటీఎం మనీ, పేటీఎం ఫైనాన్సియల్ సర్వీసెస్, పేటీఎం ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ సర్వీసెస్ వంటి వ్యాపారాలను కలుపుకుని కంపెనీకి కన్సాలిడేషన్‌‌ బేసిస్‌‌లో రూ.4,217 కోట్ల నష్టం వచ్చినట్టు ప్రకటించింది. అంటే రోజుకు రూ.11 కోట్ల కంటే ఎక్కువగానే నష్టం వస్తోంది. పేటీఎం మనీ కూడా 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.36.8 కోట్ల నికర నష్టాన్ని పోస్ట్ చేసింది. దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఎకోసిస్టమ్స్‌‌ను విస్తరించడం కోసం గత రెండేళ్ల నుంచి తాము ప్రతేడాది 100 కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెడుతున్నామని పేటీఎం అధికార ప్రతినిధి చెప్పారు. మరో రెండేళ్లలో మరో 300 కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు ప్రకటించారు.

పేటీఎం ఫౌండర్‌‌‌‌ అయిన విజయ్ శేఖర్‌‌‌‌ శర్మకి కంపెనీలో 15.7 శాతం వాటాలున్నాయి. గతేడాది అన్ని ప్రయోజనాలను కలుపుకుని ఆయనకు రూ.3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందింది. ఓ వైపు పేటీఎం నష్టాలను పోస్ట్ చేస్తున్నా… వచ్చే రెండేళ్లలో ఐపీఓకి వెళ్తామని విజయ్ శేఖర్ శర్మ చెబుతున్నారు. పర్సన్ టూ పర్సన్ ట్రాన్సాక్షన్స్ కంటే కూడా తమ ప్లాట్‌‌ఫామ్‌‌పై మరిన్ని మర్చంట్ ట్రాన్సాక్షన్స్ జరిగేలా పేటీఎం ప్రోత్సహిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం 2019 తొలి మూడు నెలల కాలంలో కంపెనీ 120 కోట్ల మర్చంట్ ట్రాన్సాక్షన్స్‌‌ను రికార్డు చేసింది. 1.4 కోట్ల రిటైల్ స్టోర్ల ద్వారా ఈ లావాదేవీలను జరిపింది.