
- ట్రంప్కు భయపడి మోదీ తోకముడిచిండు.. పాక్తో యుద్ధాన్ని అర్ధాంతరంగా ఆపేసిండు
- ఇందిరమ్మతో ఆయనకు పోలికేంటి?
- కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ అన్ఫిట్ అని కామెంట్
- షాద్నగర్లో ‘జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్’ ర్యాలీ
షాద్నగర్, వెలుగు: పదేండ్ల కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ దెబ్బతీస్తే, అదే పదేండ్ల కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను బీజేపీ సర్వనాశనం చేసిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. పదేండ్ల పాలనలో దేశానికి బీజేపీ చేసిందేంటి? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, అమిత్ షానే దేశాభివృద్ధి నిరోధకులు అని ఫైర్ అయ్యారు. మంగళవారం షాద్నగర్ పట్టణంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్’ ర్యాలీలో మహేశ్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు భయపడి ప్రధాని మోదీ తోకముడిచారని, పాకిస్తాన్తో యుద్ధాన్ని అర్ధాంతరంగా ఆపేశారని మండిపడ్డారు. ‘‘దేశానికి నిజమైన శత్రువులు మోదీ, అమిత్ షా. పాకిస్తాన్తో యుద్ధం అర్ధాంతరంగా ఎందుకు ఆపాల్సి వచ్చింది? అసలు ఎన్ని యుద్ధ విమానాలు నేలకూలాయి? దీనికి సమాధానం చెప్పి తీరాలి” అని డిమాండ్ చేశారు.
‘‘గతంలో పాకిస్తాన్తో ధైర్యంగా భారత్ యుద్ధ రంగంలోకి దిగింది. అమెరికా మధ్యవర్తిత్వాన్ని తిప్పికొట్టింది. పాకిస్తాన్ను తేరుకోలేని దెబ్బ కొట్టింది. అది ఇందిరమ్మ ఘనత. ఆమె ఉక్కుమనిషి. మరి మోదీ... మన వాళ్లను కాపాడడంలో విఫలమయ్యారు. మనోళ్లను చంపినోళ్లను శిక్షించడంలో తోకముడిచారు. చివరికి యుద్ధాన్ని కూడా అర్ధాంతరంగా ఆపి ట్రంప్కు దాసోహం అన్నారు. ఇందిరమ్మతో మోదీకి పోలిక ఏంటి? మోదీ పదవుల కోసం పుట్టిన మనిషి.. గాంధీ కుటుంబం త్యాగాల కోసం పుట్టింది’’ అని అన్నారు. ఓ వైపు మత విద్వేషాలను రెచ్చగొడుతూ, మరోవైపు బయటి దేశాలకు ఊడిగం చేస్తున్న ప్రధాని మోదీ నుంచి ప్రజలను కాపాడాలన్నారు.
కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి.. దాన్నే రాజకీయంగా భావించే బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మోదీకి దేశం మీద కన్నా, తన పదవి మీదే వ్యామోహం ఎక్కువని విమర్శించారు. ‘‘కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్.. మత వివాదాలు సృష్టించడానికి తప్ప, పాలనకు పనికిరారు. వాళ్లిద్దరూ తెలంగాణకు చేసిన మేలేమీ లేదు. వాళ్లు కేంద్రమంత్రులుగా అనర్హులు” అని విమర్శించారు.
బీజేపీ ప్రయత్నాలను తిప్పికొట్టాలి..
రాజ్యాంగాన్ని తొలగించి మనువాదాన్ని తీసుకురావడానికి బీజేపీ కుట్ర చేస్తున్నదని మహేశ్ గౌడ్ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చాలని, మహనీయుల చరిత్రను వక్రీకరించాలని చూస్తున్న బీజేపీ ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ‘‘ఎన్నో ఉన్నతమైన ఆలోచనలతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిస్తే, ఆ రాజ్యాంగాన్ని నిండు పార్లమెంటులో బీజేపీ అపహాస్యం చేసింది. భారత సమూహాన్ని ఒక్క పిలుపుతో ముందుకు నడిపి స్వరాజ్యాన్ని తెచ్చిన మహాత్మా గాంధీని విమర్శించే స్థాయికి ఆ పార్టీ దిగజారింది. అందుకే ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది.
దేశవ్యాప్తంగా ‘జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్’ ర్యాలీలు నిర్వహిస్తున్నది” అని తెలిపారు. ‘‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదలో 40 శాతం అంబానీ, ఆదానీలకు అప్పగిస్తూ.. పేదలను విస్మరిస్తున్నది. అందుకే కులగణన ద్వారా ఎవరి శాతం ఎంతో తేల్చాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, బీసీలకు మంత్రి పదవులిచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది” అని అన్నారు. త్వరలోనే నామినేటెడ్పోస్టులు భర్తీ చేస్తామని.. పార్టీ కోసం కష్టపడిన నేతలు, కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.