లేడీ ఓరియంటేడ్ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు లభించింది. స్త్రీ జీవితంలో ప్రధాన పరిణామమైన రుతుచక్రం ఇతివృత్తంతో రూపొందిన ‘పీరియడ్ : ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ డాక్యూమెంటరీకి ఆస్కార్ అవార్డ్ లభించింది. ప్రముఖ నిర్మాత గునీత్ మోంగా భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న రుతుక్రమ సమస్యల ఆధారంగా నిర్మించిన డాక్యుమెంటరీ ఆస్కార్ ను సొంతం చేసుకుంది. రేకా జెహ్తాబ్చి ఈ సినిమాకి డైరెక్టర్.
పీరియడ్స్ సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలను.. వాటి పట్ల జనాలకున్న అపోహలను.. సమాజం తీరును ఈ డాక్యుమెంటరీలో చూపించారు. ఆస్కార్ అవార్డును అందుకున్న సందర్భంగా రేకా స్టేజ్పై ప్రసంగిస్తూ.. ‘ఓ మై గాడ్. మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్య గురించి నేను డాక్యుమెంటరీ తీస్తే దానికి ఆస్కార్ వచ్చింది. నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ‘మేము గెలిచాం. భూమ్మీద ఉన్న అమ్మాయిలందరు దేవతలు. ఇప్పుడు ఈ మాటని స్వర్గం కూడా వింటుంద’ని గునీత్ మోంగా ట్వీట్ చేశారు.
WE WON!!! To every girl on this earth… know that you are a goddess… if heavens are listening… look MA we put @sikhya on the map ❤️
— Guneet Monga (@guneetm) February 25, 2019