కుట్రలు.. కుతంత్రాలు.. కార్గిల్ యుద్ధంలో ముషారఫ్ కీలక పాత్ర

కుట్రలు.. కుతంత్రాలు.. కార్గిల్ యుద్ధంలో ముషారఫ్ కీలక పాత్ర

పాకిస్థాన్‌ మాజీ సైనిక పాలకుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌.. భారత్, పాక్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో కీలక పాత్ర పోషించారు. సరిహద్దుల్లోని సియాచిన్ ప్రాంతంలో భారత్ పట్టును ముషారఫ్ సహించలేక.. కార్గిల్ చొరబాటుకు కుట్ర పన్నారు. అప్పటి పాక్ ప్రధాని బెనజీర్ భుట్టోతో ముషారఫ్ అత్యంత సన్నిహితంగా ఉండేవారు.  ఆ చొరవతోనే భుట్టోతో కార్గిల్ చొరబాటు ప్రతిపాదన చేశారు. అయితే, యుద్ధ పరిణామాలపై భయంతో భుట్టో వెనక్కి తగ్గినా.. ముషారఫ్‌ మాత్రం 1999 మార్చి నుంచి మే మధ్య కార్గిల్‌ ప్రాంతంలోకి రహస్యంగా పాక్‌ సైన్యాన్ని జొప్పించారు. ఈ విషయాన్ని భారత్‌ గుర్తించడంతో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. అయితే, ఈ విషయం అప్పటి ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు తెలియకుండానే జరిగగడం గమనార్హం. 

నిజానికి ముషారఫ్‌ సైన్యాధిపతి కావడానికి కారణం మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫే. చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా ఉన్న జనరల్‌ కరామత్‌కు, ప్రధాని షరీఫ్‌కు మధ్య విబేధాలు రావడంతో ఆయనను పదవి నుంచి తొలగించి.. ముషారఫ్‭కు పదోన్నతి కల్పించారు. ముషారఫ్‌కు ఫోర్‌ స్టార్‌ జనరల్‌గా పదోన్నతి కల్పించి చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌, జాయింట్ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఛైర్మన్‌గా నియమించారు. అయితే కార్గిల్‌ యుద్ధంతో ముషారఫ్‌, షరీఫ్‌ మధ్య విభేదాలు మొదలయ్యాయి. ముషారఫ్‌ను పదవి నుంచి తొలగించి ఆయన బాధ్యతలను ఖ్వాజా జియాయుద్దీన్‌కు అప్పగించాలని నిర్ణయించారు. ఈ విషయం తెలియగానే ఆగ్రహానికి గురైన ముషారఫ్‌1999 అక్టోబరులో సైనిక తిరుగుబాటు చేసి షరీఫ్‌ను గద్దె దింపారు. దేశంలో సైనిక పాలన విధించి అధికారాన్ని సొంతం చేసుకున్నారు. షరీఫ్‌ను గృహ నిర్బంధం చేసి ఆ తర్వాత అరెస్టు చేశారు.

2001 జూన్‌లో ముషారఫ్‌ తనను తానే అధ్యక్షుడిగా ప్రకటించుకుని.. ఐదేళ్లపాటు అధ్యక్షుడిగా కొనసాగారు. 2007లో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి రెండోసారి దేశ పగ్గాలు చేపట్టారు. అయితే ఈ ఎన్నికను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టులో తనకు వ్యతిరేకంగా తీర్పు రానుందని పసిగట్టిన ఆయన.. తీర్పు వెలువడడానికి ముందుగానే ఉగ్రవాదాన్ని సాకుగా చూపి దేశంలో ఎమర్జెన్సీ విధించారు. రాజ్యాంగాన్ని రద్దు చేసిన.. సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఇఫ్తికార్‌ ఎం ఛౌదురిని పదవి నుంచి తొలగించారు. తనకు అనుకూలంగా ఉన్న జస్టిస్‌ అబ్దుల్‌ హమీద్‌ దోగార్‌ను చీఫ్‌ జస్టిస్‌గా నియమించి.. ముషారఫ్ ఎన్నికకు ఆమోద ముద్ర వేసేలా చేశారు.  అయితే 2008లో అధికారంలో ఉన్న రెండు ప్రముఖ పార్టీలు ముషారఫ్‌కు వ్యతిరేకంగా తీర్మానం తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాయి. తన ఉద్వాసన తప్పదని భావించి దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం.. ముషారఫ్‌ అరెస్టుకు రంగం సిద్ధం చేసింది. 

మాజీ ప్రధాని బేనజీర్‌ భుట్టో, లాల్‌ మసీదు మతపెద్ద అబ్దుల్‌ రషీద్‌ ఘాజీల హత్య కేసులోనూ ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. 2007లో రాజ్యాంగాన్ని తాత్కాలికంగా రద్దు చేసినందుకు ఆయనపై దేశద్రోహం అభియోగాన్ని మోపారు. దీంతో 2008 నవంబరులో ఆయన లండన్‌కు పారిపోయారు. ఆ తర్వాత 2013లో పాక్‌కు తిరిగొచ్చిన ముషారఫ్‌.. సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో 2013లో ఆయన్ను అరెస్టు చేశారు. కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో పాటు వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. అయితే తనపై ఉన్న కేసుల్లో ఎప్పటికైనా శిక్ష తప్పదని భావించిన ముషారఫ్‌.. చికిత్స పేరుతో 2016లో దుబాయి వెళ్లిపోయారు.2007లో దేశ రాజ్యాంగాన్ని రద్దు చేసి అత్యవసర స్థితిని ప్రకటించినందుకు గానూ దేశద్రోహం కేసులో 2019లో ఇస్లామాబాద్‌ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించినా.. మరుసటి ఏడాది మరణశిక్షను తగ్గించారు.