- గత ఐదు రోజుల్లోనే లీటర్ పెట్రోల్, డీజిల్ రేట్లను రూ. 3.20 పెంచిన కంపెనీలు
- ప్రస్తుత క్రూడాయిల్ రేట్లు చూస్తుంటే ఇంకో రూ. 20 పెరిగే ఛాన్స్
వెలుగు, బిజినెస్ డెస్క్: పెట్రోల్, డీజిల్ రేట్లు శనివారం మరో 80 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో గత ఐదు రోజుల్లోనే లీటర్ పెట్రోల్, డీజిల్ రేటు రూ. 3.20 చొప్పున పెరిగింది. వీటి రేట్లను 137 రోజులు పాటు పెంచకుండా ఉంచిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ఈ నెల 22 నుంచి మళ్లీ పెంచడం స్టార్ట్ చేశాయి. ఒక్క 24 వ తేదీన తప్ప గత ఐదు రోజుల్లో నాలుగు సార్లు 80 పైసలు చొప్పున లీటర్ పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచాయి. రేట్ల పెంపు ఇంకా కొనసాగుతుందని అంచనావేయొచ్చు. రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం వలన గ్లోబల్గా క్రూడాయిల్, రా మెటీరియల్స్ రేట్లు బాగా పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడాయిల్ 120 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్తో సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండడంతో కిందటేడాది నవంబర్ మొదటి వారం నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచలేదు. కిందటేడాది నవంబర్లో బ్యారెల్ క్రూడాయిల్ రేటు 82 డాలర్లుగా ఉండగా, ప్రస్తుతం ఈ రేటు 120 డాలర్లకు పెరిగింది. సాధారణంగా గ్లోబల్గా క్రూడ్ రేటు ఒక డాలర్ పెరిగితే దేశంలో లీటర్ పెట్రోల్, డీజిల్ రేటు 60 పైసలు వరకు పెంచుతారు. దీన్ని బట్టి ప్రస్తుత క్రూడాయిల్ రేట్లను చూస్తుంటే దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు రూ. 19– 24 పెరిగే అవకాశం ఉంది. ఇక నుంచి రోజుకి 80 పైసలు చొప్పున పెట్రోల్, డీజిల్ రేట్లను కంపెనీలు పెంచుతాయనే కాస్త ఆందోళన కలిగించే వార్తలు కూడా వస్తున్నాయి.
హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ. 111.80
తాజాగా రేట్లు పెంచడంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రేటు 110.91 నుంచి రూ. 111.80 కు (89 పైసల పెరుగుదల) పెరిగింది. డీజిల్ రేటు రూ. 97.24 నుంచి రూ. 98.10 (0.86 పైసల పెరుగుదల) కి చేరుకుంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రేటు రూ. 98.61 కి, డీజిల్ రేటు రూ. 89.87 కి పెరిగాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ రేటు రూ. 113.35 కి చేరుకుంది. డీజిల్ రేటు రూ. 97.55 కు పెరిగింది. వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్పై ట్యాక్స్ రేట్లు వేరువేరుగా ఉన్నాయి. దీంతో కంపెనీలు రేట్లుపెంచితే బేస్ ప్రైస్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్, వ్యాట్, ఇతరత్ర ట్యాక్స్లను కలుపుకుంటే వివిధ సిటీలలో పెరిగిన రేట్లు వేరువేరుగా ఉంటాయి.
తెలంగాణలో పెట్రోల్ రేటులో సగం ట్యాక్సే..
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్పై వేస్తున్న ట్యాక్స్లు వేరు వేరుగా ఉన్నాయి. ట్యాక్స్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, బిహార్ రాష్ట్రాలు ముందున్నాయి. లీటర్ పెట్రోల్ రేటు రూ. 100 అనుకుంటే ఈ రాష్ట్రాల్లో రూ. 50 పైగా ట్యాక్స్లు ద్వారా వసూలు చేస్తున్నాయి. కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో కేంద్రం వేస్తున్న ట్యాక్స్ కంటే రాష్ట్రాలు వేస్తున్న ట్యాక్స్లు ఎక్కువగా ఉన్నాయి. స్టాట్స్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన డేటా ప్రకారం, అండమాన్, లక్షదీప్, పుదుచ్చేరి, మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్లలో పెట్రోల్, డీజిల్ రేట్లు తక్కువగా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతుండడంపై తాజాగా ఆయిల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. గ్లోబల్గా క్రూడాయిల్ రేట్లు పెరిగితే, దేశంలోని పెట్రోల్, డీజిల్ రేట్ల బేస్ ప్రైస్లో మార్పులుంటాయని ఆయన అన్నారు. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కింద కేంద్రానికి, స్టేట్ ట్యాక్స్ల కింద రాష్ట్రాలకి రెవెన్యూ వస్తోందని చెప్పారు. రాష్ట్రాలు, కేంద్రం వివిధ డెవలప్మెంట్ పనుల కోసం పెట్రోల్, డీజిల్ రెవెన్యూపై ఎక్కువగా ఆధారపడుతున్నాయని అన్నారు.
పెట్రో ట్యాక్స్లు తగ్గించడానికి మేము రెడీనే!
ట్యాక్స్లు తగ్గించడం ద్వారా ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించొచ్చని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్లో పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్పై ట్యాక్స్లను తగ్గించడానికి కేంద్ర రెడీగా ఉందనే సంకేతాలను ఇచ్చారు. పెట్రోల్ రేట్లు పెరుగుతుండడంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆమె తిప్పికొట్టారు. నెహ్రూ టైమ్లో కొరియన్ వార్ వలన ఇన్ఫ్లేషన్ పెరిగినా అంగీకరించిన వాళ్లు, ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్ వార్ ప్రభావాన్ని అంగీకరించడం లేదని అన్నారు. గ్లోబల్ పరిస్థితులు, ముఖ్యంగా యుద్ధ పరిస్థితులు పోటీ పడడానికి సరియైన సమయం కావని, ఎలక్షన్ టైమ్కి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. ఆయిల్ కంపెనీలు 15 రోజుల యావరేజ్ కంటే ఎక్కువ రేటుకి ఆయిల్ కొంటున్నాయంటే, కచ్చితంగా మనం ఈ భారాన్ని భరించాల్సిందే అన్నారు.