- రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ రూల్స్బ్రేక్చేసినా దొరికిపోతారు
- 24 గంటలూ పని చేయనున్న సీసీ కెమెరాలు
- కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మానిటరింగ్
- హైదరాబాద్ సహా అన్ని నగరాలు, పట్టణాల్లో అమలు
బండిపై హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తూనో..రాంగ్రూట్లో డ్రైవ్ చేస్తున్నప్పుడో ట్రాఫిక్పోలీసులు ఉన్నారా లేదా అని గమనిస్తూ పోతుంటారు చాలామంది. ఎందుకంటే ఎక్కడ ఫొటో తీసి చలానా పంపిస్తాడో అన్న భయం వారిలో ఉంటుంది. ఇదంతా నగరాల్లో ఎక్కువగా జరుగుతుంది. పట్టణాల విషయానికి వస్తే హెల్మెట్, ఇతర రూల్స్ విషయంలో ట్రాఫిక్ పోలీసులు పెద్దగా పట్టించుకోరని విచ్చలవిడిగా రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటారు. ఇక వీరి ఆటలు సాగవు. ఇలాంటి వారికి చెక్పెట్టేందుకు పోలీసు శాఖ కొత్త పద్ధతిని అమల్లోకి తెచ్చింది. అదే ‘డిస్ట్రిబ్యూటెడ్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టం’. ఈ టెక్నాలజీని ఉపయోగించి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా, ఎక్కడైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆటోమెటిక్గా అక్కడున్న సీసీ కెమెరాలు ఫొటో తీసి కమాండ్ కంట్రోల్ సెంటర్కు పంపిస్తాయి. ఇక్కడి నుంచే చలాన్లు కూడా పంపిస్తారు.
రామగుండం కమిషనరేట్లో...
సీసీ కెమెరాల ద్వారా ఈ–చలాన్విధానాన్ని రామగుండం కమిషనరేట్లో త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నారు. దీనికోసం కమిషనరేట్ ఆఫీస్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు మంచిర్యాలలో 205, పెద్దపల్లిలో 64, గోదావరిఖనిలో 32 సీసీ కెమెరాలను అమర్చారు. వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానించారు. సీసీ కెమెరాల పనితీరును పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్రెడ్డి, అడ్మిన్ డీసీపీ అఖిల్ మహాజన్తో కలిసి బుధవారం పరిశీలించారు. సీసీ కెమెరాలను ‘డిస్ట్రిబ్యూటెడ్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్సిస్టమ్’తో కనెక్ట్ చేశామని, వచ్చే సోమవారం నుంచి ఈ పద్ధతి అమలు చేస్తామని సీపీ తెలిపారు. హెల్మెట్ ధరించకున్నా, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంప్ చేసినా, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా ఆటోమెటిక్గా సీసీ కెమెరాల ద్వారా ఈ చలాన్ జనరేట్ అవుతుందన్నారు.