రండి.. పార్లమెంట్ కోసం కలసికట్టుగా పని చేద్దాం

రండి.. పార్లమెంట్ కోసం కలసికట్టుగా పని చేద్దాం

న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ భవనం శంఖుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆయనతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్, మంత్రులు హర్దీప్ సింగ్ పురి, నిర్మలా సీతారామన్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులతోపాటు దేశ ప్రజలు, వర్చువల్‌‌గా పాల్గొన్న విదేశీ ప్రతినిధులు, ఇంటర్ పార్లమెంటరీ మెంబర్స్‌‌కు శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంట్ నూతన భవన నిర్మాణ ప్రారంభోత్సవమైన ఈ రోజు దేశ చరిత్రలో అజరామరమని మోడీ చెప్పారు. దేశ ప్రజలందరూ కలసి కొత్త భవన నిర్మాణాన్ని పూర్తి చేద్దామని పిలుపునిచ్చారు.

దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకునే వేళ.. కొత్త పార్లమెంట్ భవనం నిర్మించడం చాలా మంచి విషయమని మోడీ అన్నారు. 130 కోట్ల మంది భారతీయులకు ఈ రోజు గర్వకారణమని, ఈ నిర్మాణం కొత్త, పాత అస్థిత్వాలను అనుసంధానం చేసే రోజుగా వ్యాఖ్యానించారు. సమయంతోపాటు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. 2014లో ఒక ఎంపీగా పార్లమెంట్ భవన్‌లో అడుగుపెట్టినప్పుడు, తల వంచి నమస్కరించి లోపలికి వెళ్లానని గుర్తు చేసుకున్నారు.

‘కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ సమయంలో దేశ హితం కోసం అందరూ కలసికట్టుగా కృషి చేయాలి. ఈ దిశగా అనుభవ మండపం మనల్ని ప్రేరేపిస్తోంది. అనుభవ మండపం అనేది ప్రజాస్వామ్యంలో ఓ భాగంగా ఉండేది. మన దేశంలో ప్రజాస్వామ్యం చాలా పురాతమనమైంది. అందుకు చోళుల పరిపాలనను సూచించే కొన్ని శాసనాలను ఉదాహరణగా చెప్పొచ్చు. తమిళనాడులో చెన్నైకి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉత్తరా మెరూర్ అనే గ్రామం ఉండేది. ఈ గ్రామంలో చోళ సామ్రాజ్యానికి సంబంధించి 10వ శతాబ్దంలో పాలించిన తీరును సూచించే శాసనాలు ఉన్నాయి. వీటి ప్రకారం.. అప్పట్లో చోళుల పాలనలో ప్రతి ఊరును కుడుంబులుగా విభజించేవారు. కుటుంబులను ఇప్పటి వ్యవహారంలో వార్డులుగా చెప్పొచ్చు. దీన్ని బట్టి వెయ్యేళ్ల కిందే మన దేశంలో ప్రజాస్వామ్య పాలనను చూడొచ్చు. మన దేశంలో చాలా చోట్ల ప్రజాస్వామ్య ఆనవాళ్లను చూడొచ్చు. సభ, సమితి, గణపతి, గణాధిపతి ఇలాంటి పదాలు వందల ఏళ్లుగా మన వ్యవస్థలో చిరపరిచితంగా ఉన్నాయి. రుగ్వేదంలో ప్రజాస్వామ్యాన్ని సమజ్ఞానంగా అభివర్ణించడాన్ని గమనించొచ్చు. భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని ఓ సంస్కారంగా, జీవన పద్ధతిగా, జీవన ఆత్మగా, తత్వంగా, మంత్రంగా, తంత్రంగా చూడాలి. దేశంలో సమయం మారినా, ప్రక్రియలు మారిన ఆత్మ మాత్రం ప్రజాస్వామమే’ అని మోడీ పేర్కొన్నారు.