
గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోడీ గాంధీనగర్ సమీపంలోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్ సిటీ)లోని భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాన్ని (ఐఎఫ్ఎస్సీ) శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలి అంతర్జాతీయ బులియన్ ఎక్స్ఛేంజ్ 'ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్ (ఐఐబీఎక్స్)'ను ప్రారంభించారు. ఈ ఎక్స్చేంజ్ భారతదేశంలో గోల్డ్ ఫైనాన్సైజేషన్కు ప్రోత్సాహాన్ని అందించడమే కాకుండా నాణ్యత హామీతో సమర్థవంతమైన ధరల విధానాన్ని సులభతరం చేస్తుంది. అంతే కాకుండా ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ–ఎస్జీఎక్స్ కనెక్ట్ ప్లాట్ఫారమ్లను ప్రారంభించనున్నారు.
ఈ విధానంలో సింగపూర్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (ఎస్జీఎక్స్) సభ్యుల నిఫ్టీ డెరివేటివ్లపై అన్ని ఆర్డర్లు ఎన్ఎస్ఈఐఎఫ్ఎస్సీ ఆర్డర్ మ్యాచింగ్ ట్రేడింగ్ ప్లాట్ఫారమ్కు వెళ్తాయి. గిఫ్ట్సిటీలో దాదాపు 125 టన్నుల బంగారం, 100 టన్నుల వెండిని నిల్వ చేయవచ్చు. భారత్లోకి వచ్చే బులియన్ దిగుమతులకు ఇది ప్రధాన కేంద్రంగా మారనుంది. ఐఐబీఎక్స్ వల్ల బులియన్ వ్యాపారులకు డెరివేటివ్ ప్లాట్ఫారమ్ లభించడంతో పాటు విలువైన లోహాల నాణ్యతకు భరోసా ఉంటుంది.