బెంగళూరు : దేశ రక్షణలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) కీలక పాత్ర పోషిస్తున్నదని ప్రధాని మోడీ అన్నారు. హెచ్ఏఎల్ హెలికాప్టర్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ను తుమకూరులో సోమవారం మోడీ ప్రారంభించారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ప్లాంట్. లైట్ యుటిలిటీ హెలికాప్టర్స్ (ఎల్యూహెచ్)ను ఇక్కడ తయారు చేస్తారు. ప్లాంట్ను సందర్శించి జాతికి అంకితం చేశారు. తర్వాత ఏర్పాటు చేసిన సభలో మోడీ మాట్లాడారు. దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ ప్లాంట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ యూనిట్ ఏర్పాటు చేశామన్నారు. ‘‘దేశంలోనే అతిపెద్ద హెలీకాప్టర్ ఫ్యాక్టరీ తుమకూరు జిల్లాలో ఏర్పాటైంది. రాష్ట్రంలోని యువతకు ఉపాధి దొరుకుతుంది. దీనికితోడు జిల్లాలో ప్రతీ ఇంటికి మంచినీరు అందజేసే ప్రాజెక్టులను కూడా ప్రారంభించాం. కర్నాటక ఇన్నోవేషన్కు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. డ్రోన్లు, తేజస్ ఫైటర్ జెట్స్ ఇక్కడే తయారవుతున్నాయి. ప్రపంచమంతా కర్నాటక వైపు చూస్తున్నది. ఎంతో మంది ఇన్వెస్టర్లు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న కర్నాటకను ఎంచుకుంటున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఎలా పని చేస్తున్నదో చెప్పడానికి ఈ హెలీకాప్టర్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంటే నిదర్శనం”అని మోడీ అన్నారు.
2016లో శంకుస్థాపన
2016లో ఈ ప్లాంట్ ఏర్పాటుకు తానే శంకుస్థాపన చేశానని మోడీ గుర్తు చేశారు. ‘‘దేశ భద్రత విషయంలో ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. దేశ భద్రతలో ఉపయోగించే ఆయుధాలు, యుద్ధ ట్యాంకులు, ఫైటర్జెట్స్, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్, హెలీకాప్టర్లు ఇక్కడే తయారవుతున్నాయి. వీటినే మన జవాన్లు యూజ్ చేస్తున్నారు. మేం అధికారంలోకి రాకముందు 15 ఏండ్లలో ఎరోస్పేస్ రంగంలో పెట్టిన పెట్టుబడులు.. గడిచిన 8ఏండ్లతో పోలిస్తే 5 రెట్లు పెరిగాయి. అత్యాధునిక ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఇండియా ఎదిగింది. తుమకూరు నుంచే ప్రపంచ దేశాలకు హెలికాప్టర్లు ఎగుమతి అవుతాయి. సుమారు 4లక్షల కోట్ల బిజినెస్ ఇక్కడే నుంచి జరుగుతుంది”అని మోడీ తెలిపారు. నేషన్ ఫస్ట్ అనే లక్ష్యంతో ముందుకెళ్తే కచ్చితంగా విజయం సాధిస్తామన్నారు.
ఆత్మనిర్భర్ భారత్కు బూస్ట్
‘‘ఎంత పెద్ద అబద్ధం అయినా.. ఎన్ని సార్లు చెప్పినా.. ఎవరితో చెప్పించినా.. అది నిజం కాదు. వారందరికీ హెచ్ఏఎల్ గట్టిగా సమాధానం ఇస్తున్నది. ప్రపంచ దేశాలన్నీ హెచ్ఏఎల్ వైపు చూస్తున్నాయి. ఆత్మనిర్భర్ భారత్కు బూస్ట్ ఇస్తున్నది. ఇండస్ర్టియల్ టౌన్షిప్తో పాటు ఫుడ్ పార్క్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం”అని మోడీ వివరించారు. బడ్జెట్లో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై కూడా దృష్టి సారించామని మోడీ తెలిపారు.