పోడు భూముల వ్యవహారంలో రెండు గ్రామాల మధ్య గొడవ

పోడు భూముల వ్యవహారంలో రెండు గ్రామాల మధ్య గొడవ

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ శివారులో పోడు భూముల వ్యవహారంలో గొడవ జరిగింది. కుడికిల, నార్లాపూర్ రెండు గ్రామాల రైతులు పోడు భూముల వ్యవహారంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోడు భూముల సర్వే సందర్భంగా భూమి తమది అంటే తమదంటూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రాళ్లు విసురుకుంటూ కట్టెలతో కొట్టుకుంటూ దాడులకు తెగబడ్డారు. 

దీంతో అక్కడ భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ దాడిలో రెండు గ్రామాల రైతులు తీవ్రంగా గాయపడ్డారు. పది మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. బాధితులను కొల్లాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొన్నేళ్లుగా పోడు భూముల వ్యవహారంలో రెండు గ్రామాల ప్రజల మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయి.