రేపిస్ట్​ రాజును పట్టిస్తే  పది లక్షలు

రేపిస్ట్​ రాజును పట్టిస్తే  పది లక్షలు

ఆరేండ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసులో రివార్డ్​ ప్రకటించిన పోలీసులు
9490616366, 9490616627 కు ఫోన్​ చేయాలని సూచన
చేతులపై ‘మౌనిక’ ట్యాటూలు

హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్​లోని సైదాబాద్​ సింగరేణి కాలనీలో ఆరేండ్ల చిన్నారిపై అత్యాచారం చేసి అతి కిరాతకంగా చంపేసిన నిందితుడి కోసం పోలీసులు వేటను ముమ్మరం చేశారు. రేపిస్ట్​ పల్లకొండ రాజు (30)ను పట్టించినోళ్లకు రూ.10 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించారు. మంగళవారం అతడి ఫొటోతో పాటు రివార్డుకు సంబంధించిన ప్రకటనను హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ విడుదల చేశారు. నిందితుడు 5.9 అడుగుల ఎత్తుంటాడని, రెండు చేతులపై మౌనిక అనే పేరు ట్యాటూ ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పొడవాటి జుట్టుకి రబ్బర్​ బ్యాండ్​ వేసుకుని ఉంటాడని చెప్పారు. 


నెత్తిమీద టోపీ పెట్టుకోవడంతో పాటు మెడకు ఎరుపు రంగు స్కార్ఫ్​ను కట్టుకున్నాడని, ఫార్మల్​ ప్యాంట్​, షర్ట్​ వేసుకున్నాడని అందులో పేర్కొన్నారు. బస్టాండ్​ లేదా ఫుట్​పాత్​లపైనే ఉండే అవకాశముందని, అతడి గురించి తెలిసినోళ్లు ఈస్ట్​జోన్​ డీసీపీకి 9490616366 నంబర్​లోగానీ, టాస్క్​ఫోర్స్​ డీసీపీకి 94a90616627 నంబర్​లో గానీ సమాచారం ఇవ్వొచ్చని సూచించారు. అంతకుముందు జాయింట్​ సీపీలు, డీసీపీలతో సీపీ అంజనీ కుమార్​ సమీక్ష చేశారు. టాస్క్​ఫోర్స్​, ఎస్​బీ, ఐటీ వింగ్​ అధికారులతో టీమ్​ను ఏర్పాటు చేశారు.  
సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గాలింపు
రాజును పట్టుకునేందుకు 10 స్పెషల్​ టీమ్స్​కు చెందిన వంద మంది పోలీసులు గాలింపు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడి కదలికలను తెలుసుకుంటున్నారు. ఘటన జరిగిన తర్వాత సింగరేణి కాలనీ నుంచి సైదాబాద్​, సంతోష్​నగర్​, దిల్​సుఖ్​ నగర్​, ఎల్బీనగర్​, ఉప్పల్​ పరిసర ప్రాంతాల్లో తిరిగినట్టు సీసీటీవీల ద్వారా పోలీసులు గుర్తించారు. శుక్రవారం ఓ డాక్టర్​ ఇంట్లో రాజు పనిచేసినట్టు తెలుస్తోంది. వచ్చిన కూలీ డబ్బులతో అతడు మద్యం తాగినట్టు తేల్చారు. ఆ తరువాత ఎల్బీనగర్​, ఉప్పల్​ వరకు వెళ్లినట్టు సీసీటీవీలో గుర్తించారు. అడ్డగూడూరులో ఉంటున్న రాజు తల్లిని, సూర్యాపేట జిల్లా జలాల్​పూర్​లో ఉంటున్న భార్యను పోలీసులు విచారించారు. రాజు వేధింపులు తట్టుకోలేక వాళ్లిద్దరూ దూరంగా ఉంటున్నట్టు నిర్ధారించారు.