సలాం పోలీస్..ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం

సలాం పోలీస్..ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం
  • నివాళులర్పించిన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు

వెలుగు, నెట్​వర్క్​: ఉమ్మడి వరంగల్​ జిల్లా వ్యాప్తంగా మంగళవారం పోలీస్​ అమరవీరుల దినోత్సవాన్ని (ఫ్లాగ్​ డే) నిర్వహించారు. హనుమకొండలోని కమిషనరేట్‍ అమరవీరుల స్తూపం వద్ద వరంగల్​ కమిషనర్​ సన్​ప్రీత్​సింగ్, ​వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‍.నాగరాజు, వరంగల్‍, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, స్నేహా శబరీశ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‍ చాహత్‍ బాజ్‍పాయ్‍, ఎన్‍పీడీసీఎల్‍ సీఎండీ వరుణ్‍రెడ్డి నివాళులు అర్పించారు.

  అనంతరం పోలీస్​ అమరవీరుల కుటుంబ సభ్యులు, సిబ్బందితో భారీ ర్యాలీ నిర్వహించారు. జయశంకర్​ భూపాలపల్లి ఎస్పీ ఆఫీస్​లో అమరుల స్తూపం వద్ద ఎస్పీ కిరణ్ ఖరే, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు. ములుగు జిల్లాలోని పోలీస్​ హెడ్​క్వార్టర్స్​లో ఎస్పీ శబరీశ్​ ఆధ్వర్యంలో అమర పోలీసులకు నివాళులర్పించారు. 

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయిలోని తెలంగాణ స్పెషల్ పోలీస్ 5వ బెటాలియన్ లో ఫ్లాగ్ డే నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్​అమరుల స్తూపం వద్ద ఎస్పీ సుధీర్​ రామ్​నాథ్​ కేకన్​ ఆధ్వర్యంలో నివాళులర్పించగా,  హనుమకొండ జిల్లా హసన్​పర్తి మండలం నాగారానికి చెందిన అమరుడు గ్రేహౌండ్స్​ జూనియర్​ కమాండర్​ పెరుగు రవి విగ్రహానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్​ నాగరాజు నివాళులర్పించారు. 

జనగామ జిల్లా రఘునాథ్ పల్లి పోలీస్ స్టేషన్​లో డీసీపీ రాజమహేంద్ర నాయక్ తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్​ అమరులకు నివాళులర్పించారు. అనంతరం గడిచిన ఏడాదిలో విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల పేర్లు చదివి వినిపించారు. 'శోక్‍ శ్రస్త్' చేసి మరణించిన అమరవీరులకు మౌనం పాటించారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు గిప్ట్​లు అందజేశారు. 

ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ పోలీస్​ అమరుల త్యాగాలు నిరస్మరణీయమన్నారు. పోలీసులకు ప్రజల్లో మంచిపేరు సంపాదించాలంటే విధుల్లో చిత్తశుద్ధి, నీతినిజాయతీతో పనిచేయాలన్నారు. పోలీస్‍ అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత శాఖమీదే ఉందని, వారికి ఎలాంటి సమస్య వచ్చినా పూర్తి సహకారం అందిస్తామన్నారు.