- తప్పు చేస్తే సస్పెన్షన్ తప్పదంటున్న సీపీలు
- వరుస ఘటనలతో డిపార్ట్మెంట్ అలర్ట్
- బాధితుల ఫిర్యాదు ఆధారంగా విచారణ
- నిజమని తేలితే చర్యలు
హైదరాబాద్,వెలుగు: సివిల్ సెటిల్మెంట్లు చేయడం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై గ్రేటర్లోని పోలీస్ బాసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. స్పెషల్ బ్రాంచ్తో వివరాలు సేకరిస్తున్నారు. పోలీస్స్టేషన్లలో జరుగుతున్న ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారు. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అంతర్గత విచారణ జరుపుతున్నారు. నిజమని తేలితే యాక్షన్ తీసుకుంటున్నారు. గత ఫిబ్రవరిలో టైర్ల చోరీ కేసులో పట్టుబడ్డ బేగంజార్కి చెందిన టైర్ల వ్యాపారి కమల్ కబ్రా డెబిట్ కార్డు నుంచి రూ.5 లక్షలు కొట్టేసిన ఎల్ బీనగర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ దేవేందర్ను నాలుగు రోజుల కిందట రాచకొండ సీపీ మహేష్ భగవత్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల సివిల్ వివాదాల్లో తలదూర్చిన సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ భిక్షపతిని సైతం సీపీ సీవీ ఆనంద్ గత గురువారం సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే గ్రేటర్ పరిధిలో 3 కమిషనరేట్ల పరిధిలో ఆరోపణలు ఉన్న వారిపై పోలీస్ బాసులు నిఘా పెట్టారు.
సోషల్ మీడియా, డైరెక్ట్ కంప్లయింట్ల ఆధారంగా
సోషల్ మీడియాతో పాటు డైరెక్ట్గా తమకు అందుతున్న ఫిర్యాదులను పరిశీలిస్తున్నారు. ఫిర్యాదుదారులు స్థానిక పోలీసుల మధ్య జరిగిన తలెత్తిన వివాదాలు తమ వద్ద కంప్లయింట్ చేయడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆయా సిబ్బందిపై గతంలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నారు. వాట్సాప్,ట్విట్టర్,ఫేస్బుక్లో వచ్చిన కంప్లయింట్స్, సూచనలను పరిగణలోకి తీసుకుంటున్నారు. దీంతో పాటు సిటిజన్ల నుంచి ఫీడ్ బ్యాక్ను సేకరిస్తున్నారు. పోలీస్ స్టేషన్లో రిజిస్టరైన కేసుల ఆధారంగా బాధితులకు కాల్స్ చేస్తున్నారు. పోలీసుల ప్రవర్తన, డబ్బులు డిమాండ్ చేశారా అనే వివరాలను సేకరిస్తున్నారు.
శివార్లలో సివిల్ వివాదాలు..
శివారు ప్రాంతాల్లో కొందరు పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చినట్లు ఉన్న తాధికారులు గుర్తించారు. గత మార్చిలో జరిగిన రియల్టర్ల మర్డర్ కేసులో నిర్లక్ష్యంగా ఉండటం, అవినీతి ఆరోపణలో నేపథ్యంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. గ్రేటర్లో మరో నలుగురు ఇన్స్పెక్టర్ల అవినీతిపై ఉన్నతాధికారు లకు ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. వీటిపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సమాచారం. కీలకమైన కేసుల్లో స్థానిక సిబ్బంది పనితీరుపై ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. ఆర్ధికలావాదేవీలతో ముడిపడి ఉన్న హత్యలు,కిడ్నాప్, బెదిరింపుల కేసులను పరిశీలిస్తున్నారు. అవీనితి ఆరోపణలు, డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బంది డేటాను రెడీ చేస్తున్నారు. స్థానికి డీసీపీలు,ఎస్పీలు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సంబంధిత సిబ్బందిపై యాక్షన్ తీసుకోనున్నారు.
మరిన్ని వార్తల కోసం