- ప్రైవేట్ కంపెనీలతో కలిసి షిప్పింగ్ లైన్లు డెవలప్ చేయాలన్న ఇండస్ట్రీ వర్గాలు
- ప్రొడక్ట్లను ప్రమోట్ చేసేందుకు భారీగా ఖర్చు చేయాలని సలహా
- రీసెర్చ్పై ట్యాక్స్ రాయితీలు అవసరమని వెల్లడి
న్యూఢిల్లీ : ఎగుమతులు పెంచడంపై ఈసారి ఇంటెరిమ్ బడ్జెట్లో ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి. రీసెర్చ్కు ట్యాక్స్ రాయితీలు ఇవ్వాలని, ప్రొడక్ట్ల మార్కెటింగ్కు ఎక్కువగా ఖర్చు చేయాలని సలహా ఇస్తున్నాయి. ప్రైవేట్ సెక్టార్తో కలిసి గ్లోబల్ షిపింగ్ లైన్లను డెవలప్ చేయాలని ప్రభుత్వాన్ని కోరాయి. దేశ ఎగుమతులు పెరిగే కొద్దీ ట్రాన్స్పోర్ట్ కోసం చేసే ఖర్చులు కూడా పెరుగుతున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఐఈఓ) పేర్కొంది.
‘2021 లో ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఛార్జీ కింద 80 బిలియన్ డాలర్లు ఖర్చు (రెమిటెన్స్ – ఇండియా నుంచి బయటకు వెళ్లిపోవడం) చేశాం. ట్రిలియన్ డాలర్ ఎగుమతులను చేరుకోవాలని చూస్తున్నాం. 2030 నాటికి ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఛార్జీలు 200 బిలియన్ డాలర్లను టచ్ చేస్తాయి’ అని వివరించింది. షిప్పింగ్ లైన్లను డెవలప్ చేయడంలో ప్రైవేట్ సెక్టార్ పాలు పంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఫారిన్ కంపెనీల షిప్పింగ్ లైన్ల నుంచి ఇబ్బందులు తగ్గుతాయని ఎఫ్ఐఈఓ భావిస్తోంది.
ముఖ్యంగా చిన్న, మధ్య తరహా కంపెనీలకు మేలు జరుగుతుందని అంచనా వేస్తోంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ) ని ప్రమోట్ చేయడానికి వెయిటెడ్ ట్యాక్స్ డిడక్షన్ను 200 శాతానికి పెంచాలని సలహా ఇచ్చింది. ‘దురదృష్టవశాత్తు ఆర్ అండ్ డీపై జీడీపీలో ఒక శాతం కంటే తక్కువ ఖర్చు చేస్తున్నాం. చైనా (జీడీపీలో 2.3 శాతం), యూఎస్ (3.46 శాతం), కొరియా (4.93 శాతం), ఇజ్రాయెల్ (5.56 శాతం) వంటి పెద్ద ఎకానమీలు మన కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి’ అని ఎఫ్ఐఈఓ వైస్ ప్రెసిడెంట్ ఇజ్రర్ అహ్మద్ అన్నారు. ఇండియన్ ప్రొడక్ట్ల సత్తా మిగిలిన దేశాలకు తెలియాలంటే మార్కెటింగ్ కోసం భారీ ఖర్చు చేయాలని పేర్కొన్నారు.
ఇందుకోసం బడ్జెట్లో పెద్ద మొత్తంలో ఫండ్స్ కేటాయించాలని కోరారు. ఎక్స్పోర్ట్ మార్కెటింగ్ కోసం రూ.50 వేల కోట్లతో పైలెట్ బేసిస్లో 50 జిల్లాల్లో మార్కెట్ యాక్సెస్ ఇనీషియేటివ్ (ఎంఏఐ) స్కీమ్ అమలు చేయాలన్నారు. సస్టయినబుల్ సెక్టార్లో ఉన్న చిన్న కంపెనీలు అనేక ఇబ్బందులు పడుతున్నాయని, లోన్లు పొందడంలో, రిసోర్స్లను సేకరించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయని వరల్డ్ ఆఫ్ సర్క్యూలర్ ఎకానమీ (డబ్ల్యూఓసీఈ) ఫౌండర్ అనుప్ గార్గ్ అన్నారు. మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్లో గ్రీన్ ఫ్యూయల్ వాడితే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రీన్ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేసేందుకు తీసుకున్న లోన్లపై వడ్డీ సబ్సిడీ ఇవ్వాలన్నారు. డీకార్బనైజేషన్ను ప్రమోట్ చేసే కంపెనీలకు డైరెక్ట్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని చెప్పారు.