ఢిల్లీలోని నిజాముద్దీన్ బ్రిడ్జి కింద చాలా పేద కుటుంబాలు ఉంటాయి. చెత్త ఏరుకోవడం, కూలీ పనులు చేస్తుంటారు ఆ కుటుంబాల వాళ్లు. తినడానికి తిండి ఉండదు. చదువుకు అసలే దూరం. ఏదైనా జబ్బు చేస్తే ట్రీట్మెంట్ దొరకదు. ఈ ప్రభావం చిన్నారులపై ఎక్కువగా ఉంటుంది. అయితే, ఢిల్లీలో స్లమ్స్లో ఉండే ఇలాంటి పిల్లలకు చదువు చెప్తున్నాడు జామియా హందార్ద్ డీమ్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ సకీ జాన్.
ఆ ప్రశ్నతోనే ఆలోచన
కేరళకు చెందిన సకీ 1993లో పెద్ద చదువుల కోసం ఢిల్లీ వచ్చాడు. అప్పటినుంచే సోషల్ సర్వీస్ చేసేవాడు. సెక్స్ వర్కర్స్, ట్రాన్స్జెండర్ల జీవితాల్లో మార్పు కోసం పనిచేశాడు. వీళ్లతోపాటు, ఇక్కడి ఏరియాలో ఉండే పిల్లలకు చదువు చెప్పేవాడు. ఒకరోజు పదమూడేళ్ల మియా అనే అమ్మాయి ఇంగ్లీష్లో తన పేరు ఎలా రాయాలో చెప్పమని సకీని అడిగింది. పదమూడేళ్లు వచ్చినప్పటికీ, తన పేరు కూడా రాయలేకపోతున్న మియా పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. సరైన ఎడ్యుకేషన్ అందే అవకాశం లేకపోవడం వల్లే ఇలా పిల్లలు చదువులో వెనకబడి ఉన్నారని అర్థమైంది. అలాంటి వీధిబాలలు అందరికీ చదువు అందేలా చూడాలనుకున్నాడు.
స్కూల్స్లో చేర్పిస్తూ
సకీ జాన్ చాలాఏళ్ల నుంచి ‘దీపాలయ’ అనే సంస్థతో కలిసి పనిచేస్తున్నాడు. ఈ సంస్థ ఆధ్వర్యంలో కొన్ని స్కూల్స్ నడుస్తున్నాయి. అలాగే పిల్లలకు ఫుడ్, బుక్స్ అందించడం వంటి సర్వీస్ కూడా చేస్తుంది ఈ సంస్థ. మియాలాంటి పిల్లల్ని గుర్తించి, స్కూల్లో చేర్పించే కార్యక్రమం స్టార్ట్ చేశాడు సకీ. ఇలాంటి మూడు వందల మంది పిల్లల్ని గుర్తించి గవర్నమెంట్ స్కూల్స్లో చేర్పిస్తున్నాడు. దీనివల్ల పిల్లలకు ఎడ్యుకేషన్తోపాటు, మధ్యాహ్న భోజనం కూడా అందుతుంది. ‘అనేక కారణాలతో చదువుకోలేని పిల్లల్ని గుర్తించి వాళ్లను స్కూల్స్లో చేర్పిస్తున్నాం. చదువు వల్ల పిల్లల జీవితాల్లో మార్పు వస్తుంది. అది నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. ఈ పనిలో నాతోపాటు మరికొంతమంది కుర్రాళ్లు కూడా పనిచేస్తున్నారు’ అని చెప్పుకొచ్చాడు ప్రొఫెసర్ సకీ. ఇంతేకాదు.. తనకు ఏ సంబంధంలేని ఒక నిరుపేద కోసం తన కిడ్నీ కూడా దానం చేశాడు ఈ ప్రొఫెసర్.