యాదాద్రి జిల్లాలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో వరుస ప్రమాదాలు

యాదాద్రి జిల్లాలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో వరుస ప్రమాదాలు
  • కంపెనీ చరిత్రలో నాలుగు బ్లాస్టింగ్స్​
  • ఈ ఏడాదిలోనే ఆరుగురు మృతి
  • గతంలో ఐదుగురు దుర్మరణం

యాదాద్రి, వెలుగు: జిల్లాలోని ప్రీమియర్​ ఎక్స్​ప్లోజివ్​ కంపెనీలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జరిగిన నాలుగు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. గతంలోనూ పలువురు కార్మికులు మృతి చెందారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులో 35 ఏండ్ల క్రితం ప్రీమియం ఎక్స్​ప్లోజివ్​ కంపెనీ ఏర్పడింది. ఇప్పుడా కంపెనీలో మూడు డివిజన్లు ఉన్నాయి. డిటోనేటర్​(డెట్​), డీఎఫ్ ( డిటోనేటర్ ఫ్యూజ్), ఎస్పీడీ (స్పెషల్ ప్రొడక్ట్​ డివిజన్​) నడుస్తున్నాయి.

 ఈ డివిజన్లలో వందలాది మంది పని చేస్తున్నారు. ఈ కంపెనీలోని 'ఎమల్షన్ బూస్టర్​' విభాగంలో బొగ్గుబావులు, సున్నపు రాతి, రాతి గుట్టలను పేల్చడానికి ఉపయోగించే డిటోనేటర్లు, ఫ్యూజ్​లను తయారు చేస్తోంది. వీటిని పేల్చడానికి పావుకిలో నుంచి రెండు కిలోల వరకు ఫ్యూజ్​లను ఉపయోగిస్తారు. వీటికి డిటోనేటర్లను అనుసంధానం చేసి పేలుస్తారు. దీంతోపాటు ఇస్రోకు వివిధ రకాల ప్రొడక్ట్​ను సరఫరా చేస్తున్నారు. గడిచిన నాలుగేండ్లుగా డిఫెన్స్ నుంచి ఆర్డర్స్ ప్రకారం బీకే ఎన్ వో-3 కూడా తయారు చేస్తోంది. ఈ కంపెనీకి అనుబంధంగా మోటకొండూరు మండలం కాటేపల్లిలో ఎక్స్​ప్లోజివ్​ కంపెనీని స్థాపించారు. ఈ రెండు కంపెనీల్లో చోటు చేసుకున్న పేలుడు కారణంగా పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 

ఈ ఏడాదిలోనే ఆరుగురు..

ఈ కంపెనీ 35 ఏండ్ల చరిత్రలో ఈ ఏడాదిలోనే ఎక్కువగా ప్రమాదాలు జరిగాయి. ఈ ఏడాదిలో జరిగిన మూడు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. 2025 జనవరిలోనే డిఫెన్స్​కోసం బీకేఎన్​వో -3ను మెగ్నీషియంతోపాటు గన్​ పౌడర్ సహా మరికొన్నింటిని మిక్స్​చేసి క్యారం బోర్డు కాయిన్​ సైజులో టాబ్లెట్​తయారు చేస్తున్న సమయంలో ఒత్తిడికి కారణంగా పేలుడు సంభవించింది. ఈ సమయంలో అక్కడున్న కనకయ్య మృతి చెందాడు. మరికొందరికి గాయాలయ్యాయి. 

మేలో మోటకొండూరు మండలం కాటేపల్లిలోని ఎక్స్​ప్లోజివ్​ కంపెనీలోని బిల్డింగ్-18(ఏ) బ్లాకులో ప్రోక్లెంట్ మిక్సింగ్ చేస్తుండగా పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ పేలుడు దాటికి ఆ బిల్డింగ్ మొత్తం కుప్పకూలింది. ఈ ఘటనలో దేవీ చరణ్​, గునుకుంట్ల సందీప్, నరేశ్​అక్కడే మృతి చెందారు. మరో కార్మికుడు బర్ల శ్రీకాంత్​ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తాజాగా పెద్ద కందుకూరులోని కంపెనీలో బ్రాయిలర్​ స్టీమ్ వాల్​ను సరి చేస్తుండగా వాల్​ఊడిపోయి కార్మికుడు సదానందం తలకు బలంగా తాకింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. 

గతంలో ఐదుగురు మృతి..

2012లో జరిగిన పేలుడులో ఆలేరుకు చెందిన మోయినొద్దీన్, ఎల్లయ్య దుర్మరణం చెందారు. 2019లో జరిగిన బ్లాస్టింగ్​లో పెద్ద కందుకూరుకు చెందిన జైపాల్ చనిపోయాడు. బ్లాస్టింగ్​పౌడర్​మిక్స్​చేసే బ్లేడ్​ ఊడిపోయి తాకడంతో కార్మికుడు సాగర్​ తీవ్రగాయాలై మరణించాడు. 1999లో కంపెనీ ఆవరణలో ఎక్స్​ప్లోజివ్ వెహికల్ ఢీకొనడంతో పెద్ద కందుకూరుకు చెందిన గడ్డమీద సాగర్​మృతి చెందాడు.