గ్రేటర్నోయిడా: పశుసంపదను కాపాడుకునేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం ముందుకు వెళ్తున్నదని ప్రధాని మోడీ అన్నారు. ‘లంపి’ అనే చర్మ వ్యాధితో చాలా రాష్ట్రాల్లో పశువులు చనిపోతున్నాయని వివరించారు. దీని కోసం దేశీయంగా వ్యాక్సిన్ తయారు చేశామన్నారు. ఇండియా ఎక్స్పో సెంటర్ అండ్ మార్ట్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ డెయిరీ ఫెడరేషన్ వరల్డ్ డెయిరీ సమ్మిట్ (ఐడీఎఫ్ డబ్ల్యూడీఎస్)–2022ను మోడీ ప్రారంభించి మాట్లాడారు. ‘లంపి’ చర్మ వ్యాధి వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. 2025 నాటికి పశువుల కాళ్లు, నోటి వ్యాధులకు 100% టీకాలు వేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు.
పాల ఉత్పత్తిలో ఇండియా నెంబర్ వన్
పాడి పశువులకు సంబంధించిన అతిపెద్ద డేటాబేస్ను ఏర్పాటు చేస్తున్నామని మోడీ తెలిపారు. డెయిరీ పరిశ్రమను విస్తరింపజేసేందుకు ఈ డేటా ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. ‘పశు ఆధార్’ పేరుతో బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ను తీసుకొచ్చామన్నారు. దీంతో పశువుల హెల్త్ను మానిటర్ చేసే చాన్స్ ఉంటుందని తెలిపారు. డెయిరీ సెక్టార్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి.. ఉత్పత్తి పెంచేందుకు.. ‘డెయిరీ ఎకో సిస్టమ్’ డెవలప్ చేస్తున్నామన్నారు. పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే ఇండియా నెంబర్ వన్ స్థానంలో ఉందని, 8కోట్ల మంది రైతులు ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారని వివరించారు. డెయిరీ కో–ఆపరేటివ్ సిస్టమ్లో భాగంగా 2లక్షలకు పైగా గ్రామాల్లో.. 2కోట్ల రైతుల నుంచి రోజుకు రెండు సార్లు పాలు సేకరించి ప్రజలకు చేరవేస్తామన్నారు. ఈ మొత్తం ప్రాసెస్లో మధ్యవర్తులకు స్థానం లేదన్నారు. కస్టమర్స్ నుంచి వచ్చే డబ్బు నేరుగా రైతులకు చేరుతాయని తెలిపారు. గడిచిన 5–6 ఏండ్లలో అగ్రికల్చర్, డెయిరీ సెక్టార్లో వెయ్యికి పైగా స్టార్టప్స్ ప్రారంభించామని, ఇందులో మహిళల పాత్ర ఎంతో కీలకం అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.