బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం కర్నాటకలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.10,800 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. వచ్చే మే నెలలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున మోడీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కర్నాటలోని మొత్తం 224 సీట్లకు గాను 150 స్థానాలు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో నెలలో రెండోసారి మోడీ ఇక్కడ పర్యటిస్తున్నారు. జనవరి 12న నేషనల్ యూత్ ఫెస్టివల్ సందర్భంగా హుబ్లీలో రోడ్ షో నిర్వహించారు. తాజాగా గురువారం మధ్యాహ్నం 12 గంటలకు యాదగిరి జిల్లాలోని కోడెకల్లో ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్లతో పాటు నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు ప్రారంభించనున్నారు.
తర్వాత 2.15 గంటలకు కలబురగి జిల్లాలోని మాల్ఖేడ్లో తండాలను కొత్తగా రెవెన్యూ గ్రామాలుగా ప్రకటిస్తారు. ఆ గ్రామాల్లోని అర్హులైన లబ్ధిదారులకు హక్కు పత్రాలు అందజేయడంతో పాటు నేషనల్ హైవే ప్రాజెక్టుకు శంకుస్థాప చేయనున్నారు. ప్రధాని మోడీ పర్యటన వివరాలను రాష్ట్ర సీఎం బసవరాజు బొమ్మై వెల్లడించారు. మోడీ గురువారం ప్రారంభించబోయే నారాయణపూర్ ఎడమ గట్టు కాలువ ఆధునీకరణ ప్రాజెక్ట్ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టామని తెలిపారు. ఇరిగేషన్లో ఇది ఒక మైలురాయి ప్రాజెక్టు అని ఆయన అన్నారు. అలాగే, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ల ద్వారా తాగు నీరు అందించాలనే ఉద్దేశంతో యాదగిరి జిల్లాలోని కోడెకల్లో జల్ జీవన్ మిషన్ కింద యాద్గిర్ బహుళ గ్రామ తాగునీటి సరఫరా పథకానికి మోడీ శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.