హైదరాబాద్, వెలుగు: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో పట్నా పైరేట్స్, హర్యానా స్టీలర్స్ సెమీఫైనల్స్ చేరుకున్నాయి. సోమవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్–1 మ్యాచ్లో పట్నా 37–-35తో దబాంగ్ ఢిల్లీపై ఉత్కంఠ విజయం సాధించింది. సచిన్ 9 పాయింట్లు, మంజీత్, సుధాకర్, సందీప్ తలో ఐదు పాయింట్లతో రాణించి పట్నాను ఎనిమిదోసారి సెమీస్ చేర్చారు. ఢిల్లీ కెప్టెన్ అషు మాలిక్ 19 పాయింట్ల ఒంటరి పోరాటం వృథా అయింది. రెండో ఎలిమినేటర్లో హర్యానా 42–-25తో గుజరాత్ జెయింట్స్ను చిత్తు చేసింది. రైడర్లు వినయ్ (12 పాయింట్లు), శివమ్ పటారే (8), డిఫెండర్ మోహిత్ (7 పాయింట్లు) సత్తా చాటారు. బుధవారం జరిగే సెమీ ఫైనల్లో లో జైపూర్తో స్టీలర్స్, పుణెరితో పైరేట్స్ తలపడతాయి.