ఓటీటీల్ని ఆపేయగలం అనేది భ్రమ

ఓటీటీల్ని ఆపేయగలం అనేది భ్రమ

‘‘మాస్ సినిమాలా కనిపించే హెవీ ఫ్యామిలీ డ్రామా ఇది. సోషల్ మెసేజ్ కూడా ఉంది. ఇలాంటి పాత్రని, కథని వెంకటేష్ కోసమైతే ఎవరూ రాయరు. మన హీరోలు ఒప్పుకుంటారా, ప్రేక్షకులు చూస్తారా? అనే అనుమానాలుంటాయి. అయితే రియలిజంలో కమర్షియలైజేషన్ తెచ్చి హీరోయిజం క్రియేట్ చేయగలిగే వెట్రిమారన్ ‘అసురన్’ అద్భుతంగా తీశాడు. వెంకటేష్‌‌తో ఈ రీమేక్ బాగుంటుందనిపించింది. తనకీ నచ్చింది. రైట్స్ తీసుకున్న టైమ్‌‌లో శ్రీకాంత్ అడ్డాల మరో కథతో వచ్చాడు. అది నాకు నచ్చకపోవడంతో ఇది డైరెక్ట్ చేస్తానన్నాడు. తను చిన్న చిన్న ఎమోషన్స్‌‌ని చాలా బాగా చూపిస్తాడు. ఇది అలాంటి సినిమానే. ఇంటర్వెల్ ఫైట్ తొమ్మిది రోజులు తీశాం. మామూలు కష్టం కాదు. అయినా వెంకటేష్ కంటిన్యుయస్‌‌గా షూటింగ్ చేశాడు. మొదట అనంతపురంలో షూటింగ్ చేశాం. జనం ఎక్కువ వస్తున్నారని తమిళనాడు వెళ్లాం. థాను నిర్మించిన ‘కర్ణన్’ సెకెండ్‌‌ వేవ్‌‌కి ముందు రిలీజైంది. థియేటర్స్‌‌లో ఆక్యుపెన్సీ తగ్గించడంతో ఎక్స్​పెక్ట్ చేసిన వసూళ్లు రాలేదు. ఆ భయంతోనే ఆయన ఓటీటీకి మొగ్గు చూపారు. పైగా మేమీ నిర్ణయం తీసుకున్న టైమ్‌‌లో కోవిడ్ పీక్‌‌ స్టేజ్‌‌లో ఉంది. థియేటర్స్ ఎప్పటికి తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. జనం వస్తారా లేదా అనే భయం కూడా ఉంది. ఇలాంటి చాలా కారణాల వల్ల ఓటీటీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అందరం ఫీలయ్యాం కానీ ప్రాక్టికల్‌‌గా ఆలోచించక తప్పదు. ఎందుకంటే ఓటీటీల్ని ఆపేయగలం అనేది భ్రమ. కోవిడ్ రాకపోతే ఓటీటీ ఇంత త్వరగా పాపులర్ అయ్యేది కాదు. హై క్వాలిటీ థియేటర్స్, ఓటీటీలు మాత్రమే ఫ్యూచర్‌‌‌‌లో సర్వైవ్ అవుతాయి. రియలిస్టిక్‌‌గా ఆలోచిస్తేనే సర్వైవ్ అవుతాం. ఒక రకంగా ఓటీటీల వల్ల స్టూడియోస్ వారికి పని పెరుగుతోంది. వర్కర్స్, టెక్నీషియన్స్‌‌కి అవకాశాలు పెరుగుతున్నాయి. నిర్మాతలకీ అడ్వాంటేజ్ ఉంది. కానీ ఎగ్జిబిటర్స్‌‌పైనే ఎక్కువ ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ‘నారప్ప’ విషయంలో పెద్దగా మార్పులు చేయలేదు. అయితే ‘దృశ్యం 2’ ఫస్టాఫ్‌‌లో చాలా మార్పులు చేశాం. నాలుగైదు సీన్స్ మార్చాం. విరాటపర్వం, శాకిని ఢాకిని, అహింస, దొంగులున్నారు జాగ్రత్త, తరుణ్ భాస్కర్‌‌‌‌తో ఓ సినిమా జరుగుతున్నాయి. ఇతర నిర్మాతలతో కలిసి తీస్తున్న చిత్రాలు కనుక అప్పటి పరిస్థితుల్ని బట్టి ఎలా రిలీజ్ చేస్తామనేది ఆధారపడి ఉంటుంది. ఇక వైజాగ్‌‌లో ఉన్న రామానాయుడు స్టూడియో ఇష్యూ సంగతి. అది నా పర్సనల్ ప్రాపర్టీ. ప్రభుత్వం ఇచ్చిన స్థలం కాదు. మార్కెట్ వేల్యూ కంటే ఎక్కువ పెట్టి అప్పట్లో ఆ స్థలం కొన్నాం. అక్కడ సెక్రటేరియట్‌‌ లేదా హైకోర్టు లాంటివి కట్టాలని ప్రభుత్వం అడిగి, నష్ట పరిహారం చెల్లిస్తానంటే ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు.’