ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం వీ6, వెలుగుకు సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ జాతిపితను ప్రకటించే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే మీ మనసులో ఎవరున్నరు? అని అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ ఈ సమాధానం ఇచ్చారు.
"ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత. ఈ విషయాన్ని ఇప్పుడు కాదు ఇదివరకే స్పష్టంగా చెప్పిన. జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త. కేసీఆర్ అనే వ్యక్తి ఆనాడు టీఆర్ఎస్, ఈనాడు బీఆర్ఎస్ అధ్యక్షుడు మాత్రమే. కేసీఆర్ ఉద్యమం ముసుగులో పార్టీని విస్తరించుకుండు. అధికారం చేపట్టిండు. ఆస్తులు సంపాదించుకుండు.
కేసీయారే చెప్పిండు.. బీఆర్ఎస్ పక్కా పొలిటికల్ పార్టీ అని, తాను పక్కా పొలిటీషియన్నని. కేసీఆర్కు, తెలంగాణ సమాజానికి ఎలాంటి సంబంధం లేదు. అన్ని రాజకీయ పార్టీల లాగే ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని లబ్ధి పొందిండు. ఆయన చేసిన పనికి, వచ్చిన కూలి చాలా ఎక్కువ. కేసీఆర్ ఒక్కడు వంద తరాలకు సరిపోయే గిట్టుబాటు చేసుకున్నడు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకరే.. ఎవరికీ అనుమానం అక్కర్లేదు" అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.