
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి కాలరీస్ కంపెనీ.. 2021–22 ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ. 1200 కోట్ల నుంచి రూ. 1250కోట్ల మేర లాభాలు చూపనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు హైదరాబాద్లో బుధవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఇంటర్నల్మీటింగ్లో ప్రకటించినట్లు సమాచారం. 2020–21 ఆర్థిక సంవత్సరంలో సంస్థకు రూ. 273కోట్లు లాభాలు రాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా జరగడంతో వాస్తవ లాభాలు తక్కువలో తక్కువ రూ.1500 కోట్ల నుంచి రూ.1800 కోట్ల దాకా వచ్చి ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. 2021-–22 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నాటికే సుమారు రూ.650 కోట్ల లాభాలను సంస్థ ఆర్జించింది. ఆరో నెల నుంచి దేశంలో బొగ్గు కొరత ఏర్పడటంతో సింగరేణి బొగ్గు దేశవ్యాప్తంగా హాట్కేకులా అమ్ముడుపోయింది. ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టుతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పవర్ ప్రాజెక్టులకు అవిశ్రాంతంగా బొగ్గు సప్లై చేసింది. దీంతో డిసెంబర్నాటికి అమ్మకాలు రూ.19,000 కోట్లకు, లాభాలు రూ.1,070 కోట్లకు చేరాయని సింగరేణి సీఎండీ శ్రీధర్ ప్రకటించారు. మార్చి నాటికి అమ్మకాలు(టర్నోవర్) రూ.26వేల కోట్లకు చేరగా, లాభాలు రూ.1500 కోట్లు దాటాయనే అంచనా ఉంది.
ఈ ఏడాది వాటా ఎంత?
గతేడాది లాభాల్లో కార్మికులకు యాజమాన్యం 29శాతం వాటా ఇచ్చింది. ఈసారి కూడా అదే స్థాయిలో కార్మికుల వాటా ఇస్తారా? ఇంకా పెంచుతారా? అనే విషయం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల మీటింగ్లో లాభాలపై క్లారిటీ వచ్చినా, మరో వారం రోజుల్లో లాభాలతో పాటు కార్మికుల వాటా విషయాన్ని సీఎం కేసీఆర్ ద్వారా దసరా కానుకగా ప్రకటించేందుకు యాజమాన్యం ప్లాన్ చేస్తోంది. కాగా, ఆర్థిక సంవత్సరం ముగిసి దాదాపు ఆరు నెలలు కావస్తున్నప్పటికీ లాభాల ప్రకటన చేయకపోవడంతో కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే లాభాల ప్రకటన ఆలస్యమైనందున కార్మికులకు 35శాతం వాటా ప్రకటించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవ లాభాలు రూ.1800 కోట్లకు పైగా ఉన్నాయని, వాటిని ప్రకటించకుండా కార్మికుల పొట్ట కొడ్తే చూస్తూ ఊరుకోమని బీకేఎంఎస్(బీఎంఎస్) జాతీయ కార్యదర్శి పి. మాధవ్నాయక్, సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య చెప్పారు.