విదేశాలలో ఆఫీసులున్న ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి ఐటీ కంపెనీలు ఇప్పటిదాకా విదేశీ సీఈఓలను పెట్టుకోలేదు. కానీ ఫార్మా రంగంలో గ్లోబల్గా ఎదిగిన మన తెలుగు కంపెనీ డాక్టర్ రెడ్డీస్ మాత్రం టెవా ఫార్మాలో పనిచేసిన ఇజ్రేలిని ఏరి కోరి తన సీఈఓగా నియమించుకుంది. ఐడీపీఎల్ సహా ఫార్మా రంగంలో సంపాదించిన అనుభవంతో 1984 లో డాక్టర్ అంజి రెడ్డి డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ను నెలకొల్పారు. కంపెనీలో చురుగ్గా వ్యవహరించిన డాక్టర్ అంజి రెడ్డి తర్వాత పగ్గాలు ఆయన అల్లుడు జీవీ ప్రసాద్, కొడుకు సతీష్ రెడ్డిల చేతికి వచ్చాయి. రోజువారీ కార్యకలాపాలతో పాటు, వ్యూహాత్మక నిర్ణయాలనూ వారే తీసుకునే వారు. కాలక్రమంలో డైరెక్టర్ల బోర్డును ప్రొఫెషనల్గా తీర్చి దిద్దడంలో ఆ ఇద్దరూ విజయవంతమయ్యారు. అమెరికా, యూరప్ సహా అనేక దేశాల మార్కెట్లలో గ్లోబల్ కంపెనీలతో పోటీ పడుతున్న డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్కు ఒక నిపుణుడైన ప్రొఫెషనల్ నాయకత్వం మెరుగ్గా ఉంటుందనే ఆలోచన రావడంతో ఇజ్రేలిని మొదట సీఓఓగా, ఆ తర్వాత సీఈఓగా నియమించుకుంది కంపెనీ. బోర్డు నమ్మకానికి తగినట్లుగానే ఇజ్రేలి ఫలితాలను రాబట్టగలుగుతున్నారని ఎనలిస్టులు మెచ్చుకుంటున్నారు.
వెలుగు, బిజినెస్డెస్క్: మన దేశంలో పుట్టి పెరిగిన వ్యక్తులు.. విదేశాల్లో మల్టినేషనల్ కంపెనీలను ఏలడం చూసినం.. పొగిడినం కూడా. వీరిలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల వంటి వారు ఎందరో. అదే ఒక ఇండియన్ కంపెనీకి.. అది కూడా ఫార్మా రంగంలో మూడో అతిపెద్ద కంపెనీగా దూసుకుపోతున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ను పాలించేది ఒక ఇజ్రాయిల్ వ్యక్తి. మన ఇండియన్స్ చేతుల్లోకి వచ్చాక విదేశీ కంపెనీలు ఎలా అయితే దూసుకెళ్తున్నాయో… ఈ ఇజ్రాయిల్ వ్యక్తి చేతులోకి వెళ్లాక కూడా డాక్టర్ రెడ్డీస్ అలానే సూపర్ డూపర్ లాభాలను ఆర్జిస్తోంది. ఆ ఇజ్రాయిల్ వ్యక్తి ఎవరో కాదు ఎరెజ్ ఇజ్రేలి. 2018లో తొలిసారి సీఓఓగా ఎంపికైన ఇజ్రేలిని… గతేడాదే కంపెనీ సీఈవోగా ఫౌండర్లు ప్రమోట్ చేశారు. ఇక అప్పటి నుంచి కంపెనీ ఎన్నడూ లేని లాభాలను పండిస్తోంది. సీఈవో అంటే కంపెనీని లీడ్ చేసే వారే కాదని, కంపెనీ సాధించాలనుకున్నది నెరవేరేలా చేయడమని ఇజ్రేలి చాలా సార్లు చెప్పారు. ఇజ్రేలి నేతృత్వంలో డాక్టర్ రెడ్డీస్ ఎలా పనిచేస్తోందో మార్కెట్ ఎప్పడికప్పుడు తెలుసుకుంటోంది. దానికి అనుగుణంగానే కంపెనీ షేరు ధర కదులుతోంది.
డాక్టర్ రెడ్డీస్ షేరు ధర ఆయన పదవిలోకి వచ్చినప్పటి నుంచి 28 శాతానికి పైగా పెరిగింది. డిసెంబర్తో ముగిసిన క్వార్టర్లో అత్యధిక సేల్స్ను నమోదు చేసింది. ఈ సేల్స్ విలువ రూ.4,384 కోట్లుగా ఉంది. అంచనావేసిన దానికంటే ఇవి చాలా బెటర్గా ఉన్నాయి. అన్ని సెగ్మెంట్లలో ఈ కంపెనీ గ్రోత్నే నమోదు చేస్తూ.. మార్జిన్లను బీభత్సంగా అందిస్తోంది. డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ నికర క్యాష్ నిల్వలు రూ.414 కోట్లుగా ఉన్నాయి. ఇజ్రేలి నేతృత్వంలో డాక్టర్ రెడ్డీస్ చాలా వేగంగా మారిందని విశ్లేషకులన్నారు. ప్రాఫిటబులిటీ పెరిగిందని తెలిపారు. ఇండియా, చైనా, ఇతర ఎమర్జింగ్ మార్కెట్లు ముఖ్యమైన మార్కెట్లుగా మారాయి. రెవెన్యూల్లో మొత్తం ఖర్చులు గత మూడు క్వార్టర్ల నుంచి తగ్గుతూనే ఉన్నాయి. దీంతో కంపెనీకి ఎక్కువ ఆపరేటింగ్ మార్జిన్లు వస్తున్నాయి.
మోస్ట్ ఎఫీషియెంట్ సంస్థగా నిలవాలన్న తాపత్రయం…
అంతకుముందు తాము అమెరికా ఆస్తులపై ఎక్కువగా ఫోకస్ చేసేవారమని, కానీ ఇప్పుడు ఇండియా, మిగిలిన ప్రపంచ దేశాలపై ఎక్కువగా దృష్టిసారించినట్టు ఇజ్రేలి చెప్పారు. రిస్క్తో కూడుకున్న ఆస్తులను డిజిన్వెస్ట్ చేస్తున్నామని తెలిపారు. దీంతో ఇవి మాకు మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నాయని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద జనరిక్ కంపెనీల్లో ఒకటైన టెవాలో పనిచేసిన ఇజ్రేలి, డాక్టర్ రెడ్డీస్కు వచ్చారు. ఇజ్రేలి పనితీరుపై డాక్టర్ రెడ్డీస్ ప్రత్యర్థ కంపెనీలు కూడా కన్నేశాయి. ‘ఇజ్రేలి వచ్చాక కంపెనీ కల్చర్లో అకౌంటబులిటీ పెరిగింది. కొన్ని నిర్ణయాలు చాలా వేగంగా తీసుకుంటున్నారు. అమెరికాలో స్పెషాలిటీ బిజినెస్లను అమ్మేయడం, నష్టాలు పాలయ్యే యూనిట్లను వదిలించుకోవడం వంటి నిర్ణయాలను చాలా చాకచక్యంగా తీసుకుంటున్నారు’ అని ఈ ఫార్మా కంపెనీ సీఎఫ్ఓ చెప్పారు.
ఇజ్రేలి వచ్చాకే, చైనాకు డ్రగ్స్ సప్లయి చేసేందుకు టెండర్ వచ్చింది. ఈ టెండర్ దక్కించుకున్న తొలి ఇండియన్ కంపెనీ కూడా డాక్టర్ రెడ్డీస్నే. ఇండియాలో కొన్ని మాన్యుఫాక్చరింగ్ యూనిట్లకు యూఎస్ఎఫ్డీఏతో ఉన్న రెగ్యులేటరీ సమస్యలు పరిష్కారమయ్యాయి. కంపెనీ దేశీయ వ్యాపారాల్లో కూడా సమూల మార్పులు చేసింది. కంపెనీ గ్రోత్ స్ట్రాటజీలో సానుకూల మార్పు తీసుకొచ్చింది. వాక్హార్ట్స్ దేశీయ ఫార్ములేషన్స్ పోర్ట్ఫోలియో నుంచి 62 బ్రాండ్లను దక్కించుకుంది. ఫార్మా స్పేస్లో ఈ భూమిపై ఉన్న మోస్ట్ ఎఫీషియెంట్(అత్యంత సమర్థవంతమైన) కంపెనీగా నిలవాలన్నది తమ ఉద్దేశ్యం అని ఫలితాల ప్రకటన సందర్భంగా ఇన్వెస్టర్లకు ఇజ్రేలి చెప్పారు. గ్లోబల్ కంపెనీగా నిలవాలంటే…. గ్లోబలైజేషన్కు సంబంధించిన కొన్ని అంశాలను కంపెనీలోకి ఇండక్ట్ చేసుకుంటూ డిజైన్ చేసుకోవాలని కంపెనీ సీఈవో అన్నారు. డాక్టర్ రెడ్డీస్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లోనే ఎక్కువగా ఉండే ఇజ్రేలి.. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తన ఫ్యామిలీని చూసేందుకు టెల్ అవీవ్ వెళ్తుంటారు.
ఇండియన్, ఇజ్రాయెల్ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు చాలా వరకు ఒకే విధంగా ఉంటాయని ఇజ్రేలి చెబుతుంటారు. కంపెనీ గత ఏడాది కాలంగా తన 25 మంది మేనేజర్లలో 18 మందిని మార్చేసింది. అంతేకాక లోకల్ వ్యాపారాలను ఐదేళ్లలో మూడింతలు చేయనుందని అంచనాలున్నాయి. సుమారు 60 శాతం అనలిస్ట్లు డాక్టర్ రెడ్డీస్ స్టాక్కు ‘బై’రికమండేషన్సే ఇస్తున్నారు. గత ఏడాది కాలంగా డాక్టర్ రెడ్డీస్ తన షేర్హోల్డర్స్కు 29 శాతం లాభాలను అందించింది. ఫార్మా ఇండెక్స్, సెన్సెక్స్లో అవుట్ పర్ఫార్మింగ్గా నిలిచింది. ఇజ్రేలి నేతృత్వంలో ఇంత వేగంగా దూసుకుపోతున్న ఈ కంపెనీ విషయంలో కూడా కొన్ని ఆందోళనలు ఉన్నాయి. ఒక వైపు డాక్టర్ రెడ్డీస్ అమెరికా స్పెషాలిటీ బిజినెస్ల నుంచి వైదొలిగితే.. ప్రత్యర్థి సన్ఫార్మా ఎక్కువగా దానిపైనే ఇన్వెస్ట్ చేస్తోంది.