- బ్రోకర్లు, రెవెన్యూ ఆఫీసర్ల కుమ్మక్కు
- 2006లో సేల్ డీడ్ ద్వారా అమ్మేసి, ఇప్పుడు విరాసత్ చేసుకున్నరు
- గతంలోనూ డిజిటల్ కీ మిస్ యూస్
- ఈ స్థలంపై 2008 నుంచి వివాదమే
- ఆందోళనలో ప్లాట్లు కొన్న 273 మంది బాధితులు
గద్వాల, వెలుగు: రెవెన్యూ ఆఫీసర్లు, బ్రోకర్లు కుమ్మక్కై కోట్ల ప్రాపర్టీని కొట్టేశారు. గద్వాల పట్టణ శివారులోని సర్వే నంబర్ 868లో 16 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ప్లాట్లు చేసి అమ్మారు. ఇందులో నాలుగు ఎకరాలు అప్పటి ఓనర్ శారద సేల్ కం జనరల్ పవర్ ఆఫ్ అటార్నీతో ఖలీల్, సలీంకు విక్రయించారు.
ఆ సేల్ డీడ్తోనే ప్లాట్లు చేసి అమ్మేశారు. ఇలా ప్లాట్లు చేసి అమ్మేసిన భూమిని ఇప్పుడు విరాసత్ చేయడం కలకలం రేపుతోంది. ఇదే భూమిని కొట్టేసేందుకు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ డిజిటల్ కీని మిస్ యూస్ చేయడంతో అప్పట్లో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆ భూమిని బ్లాక్ లిస్ట్ లో పెట్టగా, గుట్టు చప్పుడు కాకుండా రీ ఓపెన్ చేసి విరాసత్ చేశారు. దీంతో ఆ స్థలంలో ప్లాట్లు కొన్న 273 మంది బాధితులు ఆందోళన చెందుతున్నారు.
16 ఎకరాల్లో ప్లాట్లు..
గద్వాల పట్టణ శివారులోని సర్వే నంబర్ 868లో 16 ఎకరాల భూమి ఉంది. 868/ ఏలో అబ్దుల్లా పేరుపై ఎకరా, ఖాజా హుస్సేన్ పేరుపై 2.20 ఎకరాలు, హుస్సేన్ బీ పేరుపై ఎకరా, బాబు సాబ్ కు 1.10 ఎకరాలు, ఉస్మాన్ సాబ్ పేరుపై 1.10 ఎకరాలు, ఖాజా హుస్సేన్ పేరుపై 868/సిలో నాలుగు ఎకరాలు, శారద పేరుపై 868/బిలో నాలుగు ఎకరాల భూమి ఉంది. ఈ 16 ఎకరాల భూమిలో 2008 నుంచి 2010 మధ్య ప్లాట్లు చేసి విక్రయించారు.
నాలుగు ఎకరాల్లో సేల్ డీడ్తో అమ్మకాలు..
శారద పేరుపై 868/బిలో ఉన్న నాలుగు ఎకరాల భూమిని 9/2005 సేల్ కం జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేసుకొని 20/6/2005లో ఖలీల్, సలీం ప్లాట్లుగా మార్చి శారద ఏజెంట్లుగా ఉంటూ అమ్మారు. ఈ ప్లాట్లు కొన్నవారిలో కొందరు ఎల్ఆర్ఎస్ కట్టుకోగా, మరికొందరు ఇండ్ల కోసం పర్మిషన్లు తీసుకున్నారు. టీ పాస్ ద్వారా పర్మిషన్లు తీసుకొని ఇంటి నిర్మాణాలు చేపట్టారు.
గతంలో డిజిటల్ కీ మిస్ యూస్..
2010 వరకు ప్లాట్ల అమ్మకాలు జరగగా, ఆ తర్వాత ధరణి పోర్టల్ రావడం, అందులో గతంలో ఉన్న ల్యాండ్ ఓనర్ పేరు ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో చూపించింది. దీంతో ఆ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. 2017లో కలెక్టరేట్ లోని కొందరు ఆఫీసర్లు, కాంటాక్ట్ ఎంప్లాయిస్ కుమ్మక్కై డిజిటల్ కీని మిస్ యూస్ చేసి పాస్ బుక్ రిలీజ్ చేశారు.
దీనిపై అప్పట్లో బాధితులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ తో పాటు పాస్ బుక్ తీసుకున్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. వెంటనే రెవెన్యూ ఆఫీసర్లు స్పందించి ఆ సర్వే నంబర్లను బ్లాక్ లిస్ట్లో చేర్చారు.
గుట్టు చప్పుడు కాకుండా విరాసత్..
గద్వాల తహసీల్దార్ కేంద్రంగా బ్లాక్ లిస్ట్లో ఉన్న 868/బి సర్వే నంబర్ ను రీ ఓపెన్ చేశారు. 10 రోజుల కింద గుట్టు చప్పుడు కాకుండా ఆ సర్వే నంబర్ లోని నాలుగు ఎకరాల భూమిని శారద వారసులకు విరాసత్ చేయడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. బ్లాక్ లిస్ట్ లో ఉన్న సర్వే నంబర్ ను ఎలా విరాసత్ చేశారని ఈ స్థలంలో ప్లాట్లు కొన్నవారు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ ఆఫీసర్లు డబ్బులు దండుకొని తమకు అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారు.
ల్యాండ్ ఓనర్ ఎవరో ఎంక్వైరీ చేస్తాం
బ్లాక్ లిస్ట్లో ఉన్న సర్వే నంబర్ ను విరాసత్ చేసిన వ్యవహారంపై ఎంక్వైరీ చేస్తాం. ఆ సర్వే నంబర్ కు సంబంధించిన ల్యాండ్ ఓనర్ ఎవరనేది గుర్తిస్తాం. తప్పు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్లాట్లు కొన్నవారికి అన్యాయం జరగనివ్వం. - లక్ష్మీనారాయణ, అడిషనల్ కలెక్టర్, గద్వాల
