ట్రేడింగ్ ​వేళల పెంపు.. ట్రెడిషినల్​ బ్రోకర్లకు అదనపు ఖర్చు..

ట్రేడింగ్ ​వేళల పెంపు.. ట్రెడిషినల్​ బ్రోకర్లకు అదనపు ఖర్చు..
  • డిజిటల్​ బ్రోకర్లకు బెనిఫిట్​

ముంబై: ఇండెక్స్​ ఆప్షన్స్, ఫ్యూచర్స్​ ట్రేడింగ్​వేళలను పొడిగించాలనే నేషనల్​ స్టాక్​ ఎక్స్చేంజి (ఎన్​ఎస్​ఈ) ప్రపోజల్ ​బ్రోకింగ్​వర్గాలలో కొంత అయోమయం కలిగిస్తోంది. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఒక ట్రేడింగ్ సెషన్​ నిర్వహించాలనేది ఎన్​ఎస్​ఈ ఆలోచన. ఈ ప్రపోజల్​ను సెబీ అనుమతి కోసం పంపించారు. ఎన్​ఎస్​ఈ ట్రేడింగ్​ వేళల పెంపు ప్రపోజల్​ తమ ఆదాయ, వ్యయాలపై ఎలాంటి ఎఫెక్ట్​ చూపెడుతుందనే అంశంపై బ్రోకింగ్​ ఇండస్ట్రీ వర్గాలు ఆలోచనలో పడ్డాయి. 

సాయంత్రపు ట్రేడింగ్​ సెషన్​ కోసం ఆపరేషన్స్​ టీమ్​ను కొత్తగా నియమించుకోవల్సి వస్తుందని, ఫలితంగా అదనపు ఖర్చు తప్పదని చాలా మంది చెబుతున్నారు. సాయంత్రపు ఆపరేషన్స్​ కోసం 20–30 మంది కొత్త ఉద్యోగులను తీసుకోవాల్సి ఉంటుందని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ ఎండీ ధీరజ్​ రెల్లి చెప్పారు. చిన్న బ్రోకర్లు సైతం తమ కస్టమర్ల అవసరాలను నెరవేర్చాలంటే ఎంతో కొంత మంది కొత్త ఉద్యోగులను యాడ్​ చేసుకోవాల్సి వస్తుంది. 

అదనపు ఖర్చు..

ట్రేడింగ్​ వేళల పెంపు వల్ల బ్రోకింగ్​ ఇండస్ట్రీ ఖర్చులు డిస్కౌంట్ బ్రోకర్లకైతే 5–7  శాతం, కాల్​ అండ్​ ట్రేడ్​ (ట్రెడిషనల్​) బ్రోకర్లకైతే 10–15 శాతం దాకా పెరిగే ఛాన్స్​ ఉందని నిపుణులు చెబుతున్నారు. ​ఉద్యోగులు షిఫ్టులలో పనిచేయాల్సిన అవసరం ఉంటుందని, స్టాక్​ బ్రోకింగ్​ కూడా మాన్యుఫాక్చరింగ్​ సెటప్​ తరహాలోకి మారిపోతోందని స్టాక్​ బ్రోకింగ్​ కంపెనీ ట్రేడ్​జీనీ చీఫ్​ ఆపరేటింగ్​ ఆఫీసర్​   త్రివేష్​ చెప్పారు. ఎన్​ఎస్​ఈ ప్రపోజల్​కు సెబీ ఓకే చెబితే, కనీసం 5 నుంచి 10 శాతం ఉద్యోగులను పెంచుకోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. 

బ్రాంచీల పరిస్థితి..

హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​, మోతీలాల్​ ఓశ్వాల్​ఫైనాన్షియల్​ సర్వీసెస్​, ఐఐఎఫ్​ఎల్​ సెక్యూరిటీస్​తోపాటు ఇతర ట్రెడిషనల్​ బ్రోకర్లు  పట్టణాలు, చిన్న  సిటీలలోని   బ్రాంచీలలో అదనపు ఉద్యోగుల అవసరం ఉండకపోవచ్చని చెబుతున్నాయి. బ్రాంచీలలో క్లయింట్లకు రీసెర్చ్​, రికమెండేషన్స్​విషయంలో హెల్ప్​ చేయడానికి రిలేషన్​షిప్​ మేనేజర్లు మాకు ఉన్నారు. వారు మ్యూచువల్​ ఫండ్స్​ ప్రొడక్టులను కూడా అమ్ముతారు. మా కస్టమర్లలో 92 శాతం మంది డిజిటల్​గానే ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తున్నారని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ ఎండీ రెల్లి వివరించారు. పై కారణాల వల్ల బ్రాంచీలలో అదనపు ఉద్యోగుల అవసరం రాదని ఆయన చెప్పారు. 

కొన్ని సందేహాలు..

ఈవెనింగ్​ సెషన్స్ ట్రేడింగ్​​ఆపరేషన్స్​ నిర్వహణకు సంబంధించిన వివరాల వెల్లడి కోసం ఎదురు చూస్తున్నానని కొత్త తరపు బ్రోకింగ్​ కంపెనీ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ ఒకరు చెప్పారు. క్లయింట్ల ఫండ్స్​ను సాయంత్రం ఆరు గంటలలోపు ప్రస్తుతం బ్రోకర్లు అప్​స్ట్రీమ్​ చేస్తున్నారు. ఈ కటాఫ్​ టైము మార్పుతోపాటు, సెటిల్​మెంట్​ రిక్వైర్​మెంట్​  ఛేంజ్​కూడా ఉంటుంది. ఈవెనింగ్​ సెషన్స్​ మొదలయ్యాక ఈ మార్పులు ఎలా ఎఫెక్ట్​ చూపిస్తాయో తెలవాల్సి ఉందని పేర్కొన్నారు.

రోజువారీ సెటిల్​మెంట్​ ప్రాసెస్​ను ఈవెనింగ్​ ట్రేడింగ్​ సెషన్​ తర్వాత అంటే రాత్రి 9 తర్వాత చేయాలని రెగ్యులేటర్​ ఆదేశిస్తే, బ్రోకర్లు కొంత అదనంగానే కష్టపడాల్సి వస్తుందని ఆయన వివరించారు.