దేశంలో సిటిజన్షిప్ సవరణ చట్టం వ్యతిరేక ఆందోళనలు శనివారం కూడా కొనసాగాయి. యూపీ మినహా మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి అదుపులో ఉందని పోలీసు అధికారులు ప్రకటించారు. యూపీలో సీఏఏ ఆందోళనల్లో చనిపోయిన వారి సంఖ్య 15కు చేరింది. బీహార్లో ఆర్జేడీ శనివారం చేపట్టిన బంద్ సక్సెస్ అయింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కార్యకర్తలు ఆందోళనలు చేశారు. రైళ్లు, బస్సు సర్వీసులను నిలిపేశారు. ఢిల్లీలో కొన్ని చోట్ల ఆందోళనలు జరిగాయి. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. జామియా యూనివర్సిటీ ఎదుట స్టూడెంట్స్ ఏడోరోజూ ఆందోళనను కొనసాగించారు. మంగళూరు, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో పరిస్థితి అదుపులో ఉంది. కర్నాటక సీఎం యడియూరప్ప మంగళూరులో పర్యటించి పరిస్థితిని రివ్యూ చేశారు. కేరళ, ఢిల్లీ, చెన్నై తదితర ప్రాంతాల్లో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.
లక్నో: సిటిజన్షిప్ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తర్ప్రదేశ్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య 15కు చేరింది. వారణాసికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి కూడా చనిపోయినవారిలో ఉన్నాడు. మీరట్లో నలుగురు, కాన్పూర్ ఇద్దరు, బిజ్నూర్లో ఇద్దరు, సంభాల్, ఫిరోజాబాద్లో ఒక్కొక్కరు చనిపోయారు. అయితే చనిపోయిన మరో ఇద్దర్ని గుర్తించాల్సి ఉందని కాన్పూర్ రేంజ్ పోలీసు అధికారి చెప్పారు. రామ్పూర్లో ఒకరు చనిపోయినట్లు అధికారులు చెప్పారు. ఆందోళనకారులు రాళ్లు విసరడంతో 263 మంది పోలీసులకు గాయాలయ్యాయని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇంటర్నెట్పై బ్యాన్ విధించారు. లక్నోలో ఈ నెల 23 వరకు బ్యాన్ కొనసాగుతుందని అధికారులు చెప్పారు.
రామ్పూర్లో టెన్షన్
సీఏఏకి వ్యతిరేకంగా రామ్పూర్లో శనివారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వందలాదిగా రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు శనివారం బంద్ పాటించారు. పోలీసుల లాఠీ చార్జ్లో నలుగురు తీవ్రంగా గాయపడగా.. వారిలో ఒకరి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్గ్యాస్, వాటర్ కెనాన్లను ఉపయోగించారు. సిటీలో 144 సెక్షన్ విధించారు. కాన్పూర్లో పోలీసు పోస్టుకు నిప్పుపెట్టారు.
బీహార్లో ఆర్జేడీ కార్యకర్తల విధ్వంసం
పాట్నా/ గౌహతి/ కోల్కతా/మేఘాలయ: సిటిజన్షిప్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆర్జేడీ ఆధ్వర్యంలో శనివారం జరిగిన బీహార్ రాష్ట్ర బంద్తో జనజీవనం స్తంభించింది. ఆర్జేడీ కార్యకర్తలు పలు చోట్ల విధ్వంసం సృష్టించారు. రైళ్లు, బస్సు సర్వీసులకు ఆటంకం కలిగించారు. పాట్నా, భాగల్పూర్, ముజఫర్పూర్ లో రోడ్లపై ఉన్న టాక్సీలు, రిక్షాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆర్జేడీ మద్దతుదార్లు పాట్నా రైల్వేస్టేషన్లోకి , బస్టాండ్స్లోకి దూసుకురావడంతో పోలీసులు వాళ్లను చెదరగొట్టారు. ఈస్ట్ చంపార్ జిల్లాలో ఆర్జేడీ కార్యకర్తలు రైల్వే ట్రాక్పైకి వచ్చి ట్రైన్లకు ఆటంకం కలిగించారు. నవాడాలోని నేషనల్హైవే -31 పై రాకపోకల్ని నిలిపేశారు. రోడ్లపై టైర్లు కాల్చారు. పాట్నాలో ఆర్జేడీ పార్టీ ఆఫీసు నుంచి ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ర్యాలీ తీశారు. పాట్నా ప్రదర్శనలో రాష్ట్రీయ లోక్ సమతాపార్టీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహా కూడా పాల్గొన్నారు. బంద్తో రాష్ట్రం గుండా వెళ్లే చాలా రైళ్లు ఆలస్యంగా నడిచాయి.
కంట్రోల్లో ఉంది
అస్సాం, బెంగాల్లో శనివారం పరిస్థితి అదుపులో ఉంది. అస్సాంలో ఆందోళనకారులు శాంతియుతంగా ప్రదర్శనలు జరిపారు. బెంగాల్లో విధ్వంసాలకు పాల్పడిన 600 మందికిపైగా ఆందోళనకారుల్ని అరెస్టు చేశారు. మేఘాలయలో 8 రోజుల తర్వాత శనివారం ఇంటర్నెట్ సర్వీసును రిస్టోర్ చేశారు. సీఎం సంగ్మా రాష్ట్రంలో పరిస్థితిని రివ్యూ చేశారు.
భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ అరెస్ట్
న్యూఢిల్లీ: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ను శనివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం నుంచి పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న చంద్రశేఖర్ను జామామసీదు దగ్గరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీస్హజారీ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు.