గత ఏడాది కాలంగా టీవీ, పేపర్స్, సోషల్ మీడియా, ఫోన్... ప్రతి దాంట్లో కరోనా మహమ్మారి గురించిన వార్తలే. కరోనా కొత్త వేరియెంట్స్, వ్యాక్సినేషన్ భయాలు... ఇలా హెల్త్కి సంబంధించిన నెగెటివ్ న్యూస్, ముఖ్యంగా కొవిడ్–19 ప్యాండెమిక్ వార్తలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి అంటున్నారు సైకాలజిస్ట్లు.
ఫ్యూచర్ ప్లాన్స్కి బ్రేక్
ప్రతి ఒక్కరికి కొన్ని ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి. అవి పర్సనల్ లేదా ప్రొఫెషనల్ ఏవైనా కావొచ్చు. కరోనాతో చాలామంది డ్రీమ్స్కి ఫుల్స్టాప్ పడింది. ఈ ప్యాండెమిక్ టైంలో మొత్తానికే తమ జీవిత లక్ష్యాన్ని మార్చేసుకున్న వాళ్లూ ఉన్నారు. లాక్డౌన్ ఎత్తేయడంతో కాస్త ఊపిరి తీసుకోవచ్చు అనుకుంటుండగానే, కరోనా వైరస్ కొత్త వేరియంట్స్, థర్డ్వేవ్ గురించిన వార్తలు మళ్లీ ఆందోళనకు గురిచేస్తున్నాయి.
హెల్ప్లెస్నెస్
కొవిడ్ సంబంధించిన ప్రతి వార్త చాలామందిలో తెలియని భయాన్ని కలిగిస్తోంది. ప్యాండెమిక్ ఎప్పుడు కంట్రోల్ అవుతుందో తెలియక కొందరు ప్యానిక్ అవుతున్నారు. హెల్ప్లెస్గా ఫీలవుతున్నారు. మరికొందరైతే ‘కరోనా సోకకుండా ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి!. ఒకవేళ కరోనా పాజిటివ్ వస్తే, సరైన ట్రీట్మెంట్ అందకపోతే ఎలా?’ అని తెగ టెన్షన్ పడిపోతున్నారు.
ఒంటరితనం
వ్యాక్సిన్ వేసుకున్నా కూడా కరోనా జాగ్రత్తలు, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం చాలా ముఖ్యమని డాక్టర్లు చెబుతున్నారు. దాంతో కొందరిలో ఒంటరితనం ఎక్కువ అవుతోంది. లాక్డౌన్ కొత్తలో వీడియో కాల్స్, సోషల్మీడియా అప్డేట్స్ పట్ల చాలామంది ఇంట్రెస్ట్ చూపేవాళ్లు. కానీ, కరోనా భయాలతో ఫ్రెండ్స్, బంధువులను కలవడం కూడా తగ్గించేశారు కొందరు. ఆత్మీయులకు దూరంగా ఉండడం వల్ల మానసికంగా కుంగిపోతున్నారు మరికొంతమంది. సోషల్ లైఫ్ మిస్ అవ్వడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కొంతవరకు కారణం.
బయటపడేందుకు... మెంటల్ బ్రేక్స్
కరోనా నెగెటివిటీ, స్ట్రెస్ నుంచి బయటపడేందుకు సోషల్మీడియా, వర్క్కి కొంత బ్రేక్ ఇవ్వాలి. పది నిమిషాలు లేదా గంటపాటు ఉత్సాహాన్ని ఇచ్చే యాక్టివిటీస్ చేయ్యాలి. టీవీ చూడడం, సంగీతం వినడం, జాగింగ్ చేయడం వల్ల రిలాక్స్ అవుతారు.
పాజిటివ్ న్యూస్ చూడాలి
ఈ టైంలో పాజిటివ్ న్యూస్పై ఎక్కువ చూడాలి. కష్ట సమయంలో సాయం చేస్తోన్న వాళ్లు, కరోనా నుంచి కోలుకున్న వాళ్ల గురించిన వార్తలు పాజిటివ్ ఆలోచనల్ని పెంచుతాయి. అలాగే, కుటుంబంతో సరదాగా గడపడం కూడా మనసుకి హాయినిస్తుంది. చిన్న చిన్న సంతోషాలను ఆస్వాదించడం కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది.
మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి
మెంటల్గా వీక్గా ఉన్నవాళ్లు, పెద్దవాళ్లపై ప్యాండెమిక్ ఎఫెక్ట్ మరీ ఎక్కువ పడింది. పెద్దవాళ్లలో నూటికి పదిమందిలో యాంగ్జైటీ, డిప్రెషన్లు కనిపించాయి. కరోనా సోకుతుందేమో అనే భయం, కరోనా వల్ల ఆత్మీయులను కోల్పోవడం వంటివి అందుకు కారణం. ఒత్తిడి, భయం వల్ల నిద్ర పట్టదు. తిండి మీద ధ్యాస ఉండదు. పని మీద ఫోకస్ తగ్గుతుంది. జాబ్ పోవడం కూడా కొందరిలో స్ట్రెస్ని పెంచింది. ఈ టైంలో మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే.. సెన్సిటివ్గా ఉండేవాళ్లు కరోనా న్యూస్ చూడొద్దు. నిద్రలేమి, తినాలనిపించక పోవడం వంటి లక్షణాలు ఉంటే కౌన్సెలర్ లేదా థెరపిస్ట్ని కలవాలి.