యువత ప్రాణాలను తీస్తున్న పబ్ జీ గేమ్ ఎట్టకేలకు బ్యాన్ అయింది. అయితే అది మన దేశంలో కాదు.. నేపాల్ లో. రోజు రోజుకి ఈ ఆటపై ఉన్న పిచ్చితో యువత విలువైన సమయాన్ని వృథా చేస్తూ.. వారి భవిష్యత్తును పాడు చేసుకుంటుందని, వారిపై చెడు ప్రభావాన్ని కలుగజేస్తుందని నేపాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ ఆటను నిషేధించాల్సిందిగా నేపాల్ మెట్రోపాలిటన్ క్రైమ్ డివిజన్.. ఏప్రిల్ 10 న ఖాట్మండు డిస్ట్రిక్ట్ కోర్ట్కు ప్రజల తరపున ఓ లిటిగేషన్ ను దాఖలు చేసింది. ఈ ఆన్ లైన్ గేమ్ వల్ల పిల్లల చదువులు దెబ్బతింటున్నాయని, వారి మానసిక ఆరోగ్యం కూడా పాడవుతుందని అనేక మంది తల్లిదండ్రులు, పాఠశాలల సంఘాల నుంచి ఫిర్యాదులు అందాయని మెట్రోపాలిటన్ క్రైమ్ డివిజన్ చీఫ్ ధీరాజ్ ప్రతాప్ సింగ్ కోర్టుకు తెలిపారు.
కోర్టు ఈ విషయంపై స్పందిస్తూ.. నేపాల్ టెలికమ్యూనికేషన్స్ ను ఈ ఆటను నిషేధించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నేపాల్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ .. నేపాల్లో ఉన్న అందరు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, మొబైల్ ఆపరేటర్లు, నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్లు పబ్జి గేమ్ స్ట్రీమింగ్ను బ్లాక్ చేయాల్సిందిగా పిలుపునిచ్చింది