డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఎవరన్నది తేలిపోయింది. సస్పెన్స్కు తెరదించుతూ బీజేపీ హైకమాండ్ పుష్కర్ ధామీకి రెండోసారి అవకాశమిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలైనప్పటికీ.. పుష్కర్ ధామీకే మళ్లీ పాలనా పగ్గాలు అప్పగించాలని హైకమాండ్ నిర్ణయించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు విదేశాంగ శాఖ సహాయమంత్రి మీనాక్షి లేఖి డెహ్రాడూన్లో జరిగిన సమావేశం అనంతరం కొత్త ముఖ్యమంత్రి పేరు ప్రకటించారు. సీఎం రేసులో పుష్కర్ సింగ్తో పాటు సత్పాల్ మహరాజ్, మాజీ కేంద్ర మంత్రి రమేష్ పోక్రియాల్ నిశాంక్, ఎమ్మెల్యే అనిల్ బలూనీ ఉన్నప్పటికీ చివరకు ధామీకే అవకాశం దక్కింది. ఉత్తరాఖండ్ సీఎంగా పనిచేసిన కొంతకాలంలోనే ధామీ పాలనలో తన మార్కు చూపించారని, అందుకే మరోసారి అవకాశమిస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు.
Pushkar Singh Dhami announced as the leader of the Uttarakhand Bharatiya Janata Party Legislature Party.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 21, 2022
(File Pic) pic.twitter.com/oh7KVRuPBo
మార్చి 10న వెలువడిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కానీ ఖతిమా నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ధామీ ఓటమిపాలయ్యారు. దీంతో ఉత్తరాఖండ్ సీఎం ఎవరన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. మొత్తమ్మీద ఎన్నికల ఫలితాలు వెలువడిన 10రోజుల అనంతరం బీజేపీ హైకమాండ్ ఉత్తరాఖండ్ సీఎంను ఖరారు చేసింది.