మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట రామిరెడ్డిపై ఈడీకి ఫిర్యాదు చేశారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్ మెంట్ ఆధారంగా వెంకటరామిరెడ్డిపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేయాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెల్లపూర్ లో వెంకటరామిరెడ్డి నివాసం రాజపుష్ప నుంచి కోట్ల రూపాయలు ఎన్నికల కోసం వినియోగించారని ఫిర్యాదులో తెలిపారు. పోలీస్ ఎస్కార్ట్ వాహనాల్లో వెంకటరామిరెడ్డి ఈ డబ్బులు తరలించారని ఆరోపించారు. రాధాకిషన్ రావు చెప్పిన కన్ఫెషన్ స్టేట్ మెంట్ ఆధారంగా వెంకటరామిరెడ్డి పై ఈడీ దర్యాప్తు చేయాలన్నారు. ఓటర్లకు డబ్బులు పంచినట్లు రాధా కిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో చెప్పారని..దీని ఆధారంగా వెంకట రామిరెడ్డిపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేయాలని ఈడీకి ఫిర్యాదు చేశామన్నారు.
మరో వైపు ఏప్రిల్ 8న వెంకటరామిరెడ్డిపై సిద్దిపేట త్రీ టౌన్ పీఎస్లో ఎన్నికల నిబంధన ఉల్లంఘన కేసు కేసు నమోదైంది. సిద్దిపేటలో ఐకేపీ, ఈజీఎస్ ఉద్యోగులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారని ఎంపీ అభ్యర్థితోపాటు మాజీ సుడా చైర్మన్ రవీందర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 7న సిద్దిపేట పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో వెంకటరామ్ రెడ్డి రహస్యంగా సమావేశమయ్యారు. దాదాపు అర్ధరాత్రి వరకు ఈ భేటీ సాగింది. విషయం తెలుసుకుని కాంగ్రెస్, బీజేపీ నాయకులు అక్కడికి వెళ్లారు. దీంతో వెంకటరామిరెడ్డి తో పాటు ఉద్యోగులు అక్కడి నుంచి పరారయ్యారు.