
జన్నారం, వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్లో అటవీశాఖ విధించిన అంక్షలను ఎత్తివేయాలని బీజేపీ మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. జన్నారం నుంచి భారీ వాహనాల రాకపోకలపై అటవీశాఖ అధికారులు విధించిన అంక్షలు ఎత్తివేయాలని గత 12 రోజులుగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సామాజిక కార్యకర్త శ్రీరాములు భూమాచారి, బీజీపీ నేత బద్రీనాయక్ చేస్తున్న రిలే దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు.
టైగర్ జోన్ పేరుతో ఆంక్షలు విధించడం ఈ ప్రాంత ప్రజల అర్థిక ప్రయోజనాలను దెబ్బతీయడమేనన్నారు. వెంటనే ఆంక్షలు ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతకుముందు వారికి రైతు నేత రాజేందర్ హపవత్ మద్దతు ప్రకటించారు. బీజేపీ మండల అధ్యక్షుడు మధుసూధన్ రావు, మాజీ అధ్యక్షులు గోలి చందు, మండల ప్రధాన కార్యదర్శి రమేశ్ గౌడ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు.