పార్కింగ్ ఫీజు కడితేనే స్టేషన్లలోకి ఎంట్రీ
ఆటో, క్యాబ్ల పార్కింగ్లపై రైల్వే కొత్త రూల్
క్యాబ్స్కు ఆర్నెల్లకు 5,400,
ఆటోలకు రూ.3,500 ఫీజు
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యూనియన్లు
ప్రయాణికులపై పెరగనున్న భారం
హైదరాబాద్, వెలుగు: రైల్వే స్టేషన్లలో పాసింజర్స్ను ఎక్కించుకోవాలంటే ఇకపై ఆటో వాలాలు, క్యాబ్ డ్రైవర్లు పార్కింగ్ ఫీజు కట్టాలి. ఫీజు చెల్లించని బండ్లకు కనీసం స్టేషన్ లోపలికి ఎంట్రీ కూడా ఉండదు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. ఈ నిబంధనలు సికింద్రాబాద్ డివిజన్లోని అన్ని రైల్వే స్టేషన్లలో అమలు కానున్నాయి. అయితే ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో టోయింగ్ ఫీజు పేరుతో వసూళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది.
పేరు నమోదు చేసుకుని ఫీజు కట్టాలి
సాధారణంగా ఆటోలు, క్యాబ్స్ స్టేషన్ల లోపలికి వచ్చి ప్యాసింజర్స్ను పికప్ చేసుకుంటాయి. ఈ సమయంలో గందరగోళం లేకుండా ఆటోలు, క్యాబ్లు లైన్గా వచ్చే పద్ధతిని అమలు చేస్తున్నారు. ఇది ప్రస్తుతం సికింద్రాబాద్ లాంటి పెద్ద స్టేషన్లలో అమల్లో ఉంది. అయితే కొత్తగా ఫీజులు వసూలు చేయనున్నారు. స్టేషన్లలోకి రావాలంటే ఆటోలు, క్యాబ్ డ్రైవర్లు ముందే పేర్లు నమోదు చేసుకోవాలి. ఆధార్ కార్డు, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ సరిగా ఉంటే అప్రూవల్ చేసి నంబర్ ఇస్తారు. ఆ తర్వాత నిర్ణయించిన మేర ఫీజు చెల్లించాలి.
ఆర్నెల్లకు 5,400 ఫీజు
స్టేషన్ గ్రేడ్, వెహికల్స్ను బట్టి పార్కింగ్ ఫీజు నిర్ణయించారు. ఎన్ఎస్జీ–2 (నాన్ సబర్బన్ గ్రేడ్), ఎన్ఎస్జీ–3, ఎస్జీ–3 (సబర్బన్ గ్రేడ్)లో ఆటోలకు ఆర్నెల్ల కాలానికి రూ.3,500గా నిర్ణయించారు. ఎన్ఎస్జీ –4కి రూ. 2,500, ఇతర స్టేషన్లకు రూ.1,500 చొప్పున టారీఫ్ పెట్టారు. ఇక ట్యాక్సీల విషయానికొస్తే ఎన్ఎస్జీ–2, ఎన్ఎస్జీ-–3, ఎస్జీ–-3 కేటగిరీల్లో క్యాబ్లకు ఆర్నెల్ల కాలానికి రూ.5,400, ఎన్ఎస్జీ–4కు రూ.3,500, ఇతర స్టేషన్లలో రూ.2,500 చొప్పున ఫీజు నిర్ణయించారు.
ఇప్పటికే పార్కింగ్ మోత
సికింద్రాబాద్ స్టేషన్ మెయింటెనెన్స్ను ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. దీంతో ఇటీవల స్టేషన్ ప్రాంగణంలో పార్కింగ్ ఫీజు భారీగా వసూలు చేస్తున్నారు. ప్యాసింజర్స్ పికప్, డ్రాప్ సమయంలో వెహికల్స్ ఎక్కువసేపు ఉంటే ఓవర్ స్టే ఛార్జీలు విధిస్తున్నారు. ఇందుకు మొదటి 5 నిమిషాలపాటు ఫ్రీ ఉంటుంది. ఆ తర్వాత ఛార్జీల మోత మోగుతుంది. 5 నుంచి 15 నిమిషాల మధ్య ఓవర్ స్టే చేస్తే రూ.100, 15 నుంచి 30 నిమిషాల మధ్య అయితే రూ.200 విధిస్తున్నారు. 30 నిమిషాలు, ఆపైన ఉంటే రూ.1,000తో పాటు అదనంగా టోయింగ్ చార్జీలేస్తున్నారు. ఇది అన్ని వాహనాలకు వర్తిస్తుంది. సాధారణంగా రైల్వే స్టేషన్ల నుంచి ఆయా ప్రాంతాలకు ఆటో, క్యాబ్ చార్జీలు భారీగానే వసూలు చేస్తారు. కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ అయితే.. ఆ భారం జనంపైనా పడనుంది.
యూనియన్ల నుంచి వ్యతిరేకత
పార్కింగ్ ఫీజుల వసూలు నిర్ణయాన్ని ఆటో, క్యాబ్ యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి. రైల్వే అధికారుల తీరుతో లక్షలాది మంది కార్మికులకు అన్యాయం జరుగుతుందంటున్నాయి. సంపాదించే అరకొర డబ్బుల్లోంచి రైల్వేకు ఫీజులు కట్టాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నాయి.
నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
కొత్త పార్కింగ్ ఫీజు వసూలు నిర్ణయాన్ని విత్ డ్రా చేసుకోవాలి. రోజుకు 200 నుంచి రూ.300 సంపాదించి కుటుంబాలను పోషించుకునే ఆటో డ్రైవర్లకు ఇది పెనుభారం. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఉద్యమిస్తం.
– ఎ.సత్తిరెడ్డి, ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ నేత
For More News..