మహారాష్ట్రలో చాలా పొలిటికల్ మార్పులు రాబోతున్నాయా? ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే చిన్నాన్న కొడుకు రాజ్ థాక్రేని బీజేపీ ఎంకరేజ్ చేయబోతోందా? ప్రస్తుతం కాంగ్రెస్, ఎన్సీపీలతో పొత్తు పెట్టుకుని శివసేన పవర్లోకి రావడంపై ఆ పార్టీ కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని బీజేపీ క్యాష్ చేసుకోవాలనుకుంటోందా? ఎంఎన్ఎస్ పార్టీ జెండాని రాజ్ పూర్తిగా మార్చేసి, కొత్త రూపం ఇవ్వడం వెనక కారణం ఇదేనా? ఈ సంకేతాలన్నీ త్వరలో జరిగే మార్పులకు ముందస్తు సన్నాహాలే అంటున్నారు ఎనలిస్టులు. అయితే ఇప్పటికిప్పుడు ఎంఎన్ఎస్ వల్ల బీజేపీకి ఒరిగేదేమిటనే చర్చకూడా బలంగా వినిపిస్తోంది.
నిప్పు లేనిదే పొగ రాదన్న నానుడి రాజకీయాల్లో నూరు శాతం సరిపోతుంది. ఈ నెల రెండోవారంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రేతో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ కావడం కూడా అలాంటిదే. కేవలం ఫ్రెండ్లీగానే కలిశామని ఫడ్నవీస్ అన్నప్పటికీ, బిట్వీన్ ది లైన్స్ ఏమై ఉంటుందా అని కూపీ లాగారు ఎనలిస్టులు. తాజాగా తన పెదనాన్న బాల్ థాక్రే 94వ జయంతి వేడుకల సందర్భంలో రాజ్ తన రాజకీయ ఎత్తుగడల్ని బయటపెట్టారు. ముంబై శివారులోని గోరేగావ్లో జరిగిన సభలో.. శివసేన ఫౌండర్ బాలా సాహెబ్ నమ్మిన మరాఠా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. అంతకు ముందు జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో తమ పార్టీకి కొత్త జెండాని విడుదల చేశారు. కాషాయ జెండాలో శివాజీ మహారాజ్ ‘రాజముద్ర’ని చేర్చారు. పార్టీని పూర్తిగా కాషాయీకరణ చేయడమేకాక, కేంద్ర ప్రభుత్వ సిటిజెన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్నార్సీ)లకు మద్దతు ప్రకటించారు. ఇల్లీగల్ మైగ్రెంట్లను తరిమికొట్టాలన్న డిమాండ్తో వచ్చే నెల 9న ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఇది చెప్పుకోదగ్గ పరిణామంగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఢిల్లీ ఎన్నికలు ముగిశాక యాక్షన్ ప్లాన్
ఢిల్లీలో ఎన్నికలు ముగిశాక మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు ఖాయమయ్యేలా ఉన్నాయి. బాల్ థాక్రే హయాం నుంచీ చెట్టపట్టాలు వేసుకున్న శివసేన, బీజేపీ విడిపోయాక, ఎనలిస్టులు చాలా కోణాల్లో రోజువారీ పాలిటిక్స్ని గమనిస్తున్నారు. శివసేన తన శత్రువులైన కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుంది. ముప్పయ్యేళ్లుగా బీజేపీతో ఉన్న స్నేహాన్ని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే తన కొడుకు ఆదిత్య కోసం వదిలేసుకున్నారు. గతంలో 2014లోనూ బీజేపీని కాదనుకుని వెళ్లిపోయినా ఆ తర్వాత మళ్లీ కలిశారు. కానీ, ఇప్పుడు కేవలం పవర్ కోసమే బీజేపీకి దూరమయ్యారన్న అపవాదు మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ దెబ్బకు దెబ్బ తీయాలన్న కసితో ఉన్నట్లుగా ఎనలిస్టులు చెబుతున్నారు. అందుకే రాజ్ థాక్రేని తమతో కలుపుకోవాలన్న నిర్ణయానికి వచ్చిందంటున్నారు.
ఇప్పటికిప్పుడు ఎంఎన్ఎస్ వల్ల బీజేపీకి ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే, మహారాష్ట్ర రాజకీయాల్లో దూకుడుగా ఎంట్రీ ఇచ్చిన ఎంఎన్ఎస్ కొంతకాలంగా చాలా వెనుకబడిపోయింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 13 సీట్లు గెలుచుకుని నాలుగో పెద్ద పార్టీ అయింది. మరో 24 స్ఠానాల్లో రెండో ప్లేస్లో నిలబడింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి 144 సీట్లతో అధికారంలోకి రాగా, శివసేన–బీజేపీ కూటమి 90 సీట్లు తెచ్చుకుని ప్రతిపక్షంలో కూర్చున్నాయి. ఎంఎన్ఎస్కి చాలా భవిష్యత్తు ఉందని అందరూ అనుకున్నారు. ముంబై నగరంలో ఆరు సీట్లు, నాసిక్లో 3, థానే జిల్లాలో రెండు, ఫుణే, ఔరంగాబాద్ల్లో ఒక్కొక్కటి ఎన్ఎంఎస్ ఖాతాలో పడ్డాయి. 2012 నాటికి 16 కార్పొరేషన్లకు గాను బృహన్ ముంబై, నాసిక్, కల్యాణ్–దోంబీవాలీ, పుణే, జల్గావ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మంచి సత్తా చూపించింది.
ఐదేళ్లుగా తగ్గుతున్న పాపులారిటీ
అలాంటి పార్టీ 2014 ఎన్నికల్లో ఒక్క స్థానానికే పరిమితమయ్యింది. జున్నార్ స్థానంలో శరద్ దాదా సోనావానే ఎంఎన్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికల్లో బీజేపీ, శివసేన విడివిడిగా పోటీ చేసి, పోస్ట్ అలయెన్స్తో పవర్లోకి వచ్చాయి. ఎంఎన్ఎస్ పూర్తిగా నష్టపోయింది. 218 సీట్లలో కేండిడేట్లను నిలబెడితే, 203 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఇక, 2017లో జరిగిన మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ చావు దెబ్బ తింది. కల్యాణ్–దోంబీవాలీ కార్పొరేషన్లో మాత్రమే డబుల్ డిజిట్ కార్పొరేటర్లను గెలిపించుకోగలిగింది. నాసిక్ కార్పొరేషన్లో బలం 40 నుంచి 5 సీట్లకు పడిపోయింది. 10 కార్పొరేషన్లలో అసలు పోటీయే చేయలేని పరిస్థితిని ఎదుర్కొంది. బృహన్ ముంబై కార్పొరేషన్లో ఏడుగురు గెలవగా, వాళ్లలో ఆరుగురు శివసేనలో చేరిపోవడంతో, ప్రస్తుతం ఒక్కరే కార్పొరేటర్ మిగిలారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంఎన్ఎస్ది అదే పరిస్థితి. కేవలం ఒకే ఒక్క సీటు (కల్యాణ్ రూరల్లో రమేశ్ రతన్ పాటిల్) గెలుచుకుంది. ఆర్థికంగా బలం లేకపోవడం, దూకుడుగా పార్టీ కార్యకర్తలు ప్రవర్తించడం వంటివి ఎంఎన్ఎస్ని బాగా దెబ్బతీశాయంటారు ఎనలిస్టులు. ఓటు షేర్ 2.25 శాతానికి పడిపోయింది. అలాగని ఎంఎన్ఎస్ని తీసిపారేయలేరు. ముంబై, నాసిక్, మరఠ్వాడా ప్రాంతాల్లో ఎంఎన్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. మాహిం, సేవ్రీ, భందుప్ వెస్ట్, ములుంద్ వంటి చోట్ల బీజేపీ–శివసేన కూటమికి గట్టి పోటీ ఇవ్వగలిగింది. కాబట్టి, రాజ్ థాక్రే గనుక తమవైపు ఉన్నట్లయితే, అసంతృప్తితో ఉన్న శివసైనికులను తిప్పుకోవడానికి అవకాశముంటుందని బీజేపీ అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. ఉద్ధవ్ థాక్రే తన కొడుకు కోసమే పార్టీ సిద్ధాంతాల్ని, ఆశయాల్ని వదులుకుని కాంగ్రెస్–ఎన్సీపీలతో చేతులు కలిపారన్న ఫీలింగ్ చాలామంది శివసేన కార్యకర్తల్లో ఉందంటున్నారు. ఉద్ధవ్ థాక్రే ప్రవర్తన కూడా ఆయన సన్నిహితులకు చికాకు పుట్టిస్తోందని ఎనలిస్టుల అంచనా. తన మిత్రులెవరో, శత్రువులెవరో కూడా గుర్తించలేకపోతున్నారని, అక్టోబరులో అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాక ఇతరులెవ్వరినీ నమ్మకుండా సంజయ్ రౌత్ ఒక్కరితోనే మంతనాలు సాగించడాన్ని కొందరు ఓపెన్గానే విమర్శిస్తున్నారు. తన పొలిటికల్ అడ్వయిజర్గా కాకుండా శ్రేయోభిలాషిగా సంజయ్ని భావిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికైతే ఉద్ధవ్ ఎమ్మెల్యే కాదు. రూల్స్ ప్రకారం మే నెలలోగా ఆయన ఏదో ఒక చోట నుంచి అసెంబ్లీకి గెలవడమో, లేదా కౌన్సిల్ మెంబర్ కావడమో తప్పదు.
బాలాసాహెబ్ వారసుడిగా…
రాజ్ థాక్రే విషయంలో అలాంటి అసంతృప్తులేవీ లేవని, ఆయన ఏ విషయంలోనైనా పెదనాన్న బాల్ థాక్రేలా సొంతంగా ఆలోచిస్తారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. అందుకే ‘బాలాసాహెబ్కి నిజమైన వారసుడు రాజ్ థాక్రేనే’ అనే మెసేజ్ వాళ్లకు ఇవ్వాలన్నది బీజేపీ స్ట్రేటజీగా ఊహిస్తున్నారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ–ఎంఎన్ఎస్ కలిసి పనిచేయడానికి ఇప్పటికే రంగం సిద్ధమైందని, శివసేన ఓటు బ్యాంక్ని లాక్కోవడానికి తగిన నాయకుడు రాజ్ థాక్రే ఒక్కరేనని చెబుతున్నారు. అదీగాక, ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి సౌత్కి వెళ్లేసరికి బీజేపీ కూటమిలో ఎవరూ లేరు. ఈ కోణంలో చూసినా బీజేపీ తన బేస్ని బలంగా మార్చుకోవాలంటే రాజ్ థాక్రేతో చేయి కలపక తప్పదంటున్నారు ఎనలిస్టులు.
గతంలో రాజ్ థాక్రే పార్టీ జెండాలో కాషాయం, నీలం, తెలుపు, గ్రీన్ రంగులుండేవి. నీలం ద్వారా దళితులను, కాషాయం ద్వారా హిందువులను, గ్రీన్ కలర్ ముస్లింలను సూచించేలా జెండా ఉండేది. మూడు నెలల క్రితం శివసేన.. తన ప్రధాన శత్రువులైన కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపి అధికారం దక్కించుకుంది. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. దీనినే ఎంఎన్ఎస్ తన కొత్త ఎజెండాకి అనుకూలంగా మార్చుకుంది. ఈ మూడు నెలల నుంచి సాగిస్తున్న చర్చల ఫలితంగానే.. రాజ్ థాక్రే ఇల్లీగల్ మైగ్రెంట్లను తరిమికొట్టాలన్న డిమాండ్తో ర్యాలీకి రెడీ అవుతున్నారు. శివసేన పవర్ కోసం పార్టీ సిద్ధాంతాల్ని పక్కనపెట్టేసిందనే ప్రచారం బాగా సాగుతోంది. హిందూత్వ కార్డును శివసేన వదిలేసిందని, ఆ లోటును ఎంఎన్ఎస్ భర్తీ చేస్తుందని అంటున్నారు. పార్టీ మీటింగ్లో ‘నేను మరాఠీని, హిందువును. నేను పవర్ కోసం నా పార్టీ రంగును మార్చుకోను’ అని ప్రకటించడం ఇందులో భాగమే!
దూకుడే రాజ్ బలం
శివసేన రాజకీయాల్లో ఉద్ధవ్ థాక్రే ఒక మలుపు. ఆయన ప్రవేశించేవరకు శివసేనలో బాల్ థాక్రే తమ్ముడి కొడుకు రాజ్ థాక్రే హవా నడిచేది. పెద్ద నాన్నకి చేదోడువాదోడుగా ఉండేవారు. బాల్ థాక్రే మాదిరిగానే రాజ్ కూడా పొలిటికల్ కార్టూనిస్టు, మంచి వక్త. ఆయన మాటతీరు, వ్యవహారశైలి కూడా బాలాసాహెబ్లా ఉంటుందంటారు. చాలాసార్లు మీనా తాయ్ (బాల్ థాక్రే భార్య) పార్టీ ఆఫీసుకి ఫోన్ చేస్తే రాజ్ రిసీవ్ చేసుకునేవారట. ఆమె తన భర్తే మాట్లాడుతున్నారనుకుని పొరబడేవారట. ఉద్ధవ్ థాక్రే పార్టీలో ప్రవేశించాక ఎన్నికల సీట్ల కేటాయింపులో రాజ్ మాటని పట్టించుకోలేదు. దాంతో ఆయన బాలాసాహెబ్ బతికుండగానే బయటకు వచ్చేసి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ఏర్పాటు చేసుకున్నారు.
రాజ్ థాక్రే చాలా విషయాల్లో కార్యకర్తల్ని ఊసిగొల్పిన సందర్భాలున్నాయి.
మరాఠీ భాషలోనే సైన్ బోర్డులుండాలని షాపు ఓనర్లపై ఒత్తిడి తేవడం
మునిసిపాలిటీల్లో సరిగ్గా పనులు చేయని కాంట్రాక్టర్లపై చేయి చేసుకోవడం
ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్న మల్టీఫ్లెక్స్ థియేటర్లపై దాడి చేయడం
మహారాష్ట్రలోని టోల్ గేట్లపై దాడి చేయడం, 2 కోట్ల రూపాయల లోపు ఖర్చుతో రోడ్లు వేసిన చోట్ల టోల్ గేట్లు మూయించడం.
గుజరాతీల షాపులపై దాడి చేసి, మరాఠీలో బోర్డులుండేలా డిమాండ్ చేయడం
రాజ్ థాక్రే వేసిన కార్టూన్ని విమర్శిస్తూ ఫేస్బుక్లో పోస్టు పెట్టినందుకు ఒకరిని చితక్కొట్టడం. ఇలాంటి పనులన్నీ ఎంఎన్ఎస్ కార్యకర్తలు తరచు చేస్తుంటారు. అయితే, ఇవన్నీ మరాఠాల ఆత్మగౌరవాన్ని కాపాడ్డానికే చేస్తు న్నామని రాజ్ సమర్థించుకుంటారు.
కొడుకు అమిత్కి ప్రోత్సాహం
థాక్రే ఫ్యామిలీ నుంచి చట్టసభల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్నది రాజ్ థాక్రే ఆలోచన. ఆయన పెట్టిన ఎంఎన్ఎస్ తరఫున శాలిని థాక్రే పోయినేడాది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. రాజ్ కజిన్ జితేంద్ర వినాయక్ థాక్రే భార్య శాలిని. ఆమె ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గంలో నిలబడి మూడో స్థానం దక్కించుకున్నారు. బాల్ థాక్రే మాత్రం ఎప్పుడూ శివసేన నుంచి తన ఫ్యామిలీ మెంబర్లకు టిక్కెట్లివ్వలేదు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఉద్ధవ్ థాక్రే తన కొడుకు ఆదిత్యను వర్లి స్థానంలో నిలబెట్టి గెలిపించారు. ఉద్ధవ్ థాక్రే ఇప్పటికీ ఎమ్మెల్యే కాదు. ఇదలా ఉంచితే, రాజ్ థాక్రే తన కొడుకు అమిత్ థాక్రేని పార్టీలోకి తెచ్చారు. ఎంఎన్ఎస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో తన వారసుడిని కార్యకర్తలకు పరిచయం చేశారు.