
- బ్రహ్మోస్ శక్తి ప్రదర్శన కాదు.. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంలో ముందడుగని వెల్లడి
- యూపీ సీఎం యోగితో కలిసి సైన్యానికి బ్రహ్మోస్ మిసైల్స్ అప్పగింత
లక్నో: పాకిస్తాన్లోని ప్రతి అంగుళం మన బ్రహ్మోస్ రేంజ్లోకి వచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్పేర్కొన్నారు. ఇక మన శత్రుదేశం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేదని అన్నారు. ఆపరేషన్ సిందూర్ ఓ ట్రైలర్ మాత్రమేనని, దీని ద్వారా మన సైన్యం పరాక్రమం చాటిందని చెప్పారు. శనివారం లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో తయారైన మొదటి బ్యాచ్ మిసైళ్లను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి రాజ్నాథ్ సింగ్ సైన్యానికి అప్పగించారు.
అనంతరం ఆయన మాట్లాడారు. ఇది భారత రక్షణ పరిశ్రమకు ఒక మైలురాయి అని పేర్కొన్నారు. ‘‘ఆపరేషన్ సిందూర్లో జరిగింది కేవలం ట్రైలర్ మాత్రమే. కానీ ఆ ట్రైలర్ ద్వారా భారత్ తలచుకుంటే తమ దేశాన్ని ఏమైనా చేయగలదని పాకిస్తాన్కు తెలిసిపోయింది” అని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ విక్టరీ మనకు ఓ చిన్న విషయం కాదని.. మన సైన్యానికి విజయాలు అలవాటుగా మారాయని రాజ్నాథ్ ప్రశంసించారు. ఇక్కడి బ్రహ్మోస్ బృందం ఒక నెలలోనే 2 దేశాలతో రూ.4 వేల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుందని చెప్పారు.
కాగా, బ్రహ్మోస్ మిసైల్ తయారీ భారత స్వయం స్వావలంబనకు పునాది అని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఈ యూనిట్ల కోసం 2,500 ఎకరాల భూమిని అందుబాటులో ఉంచామని తెలిపారు.
యూపీలో పారిశ్రామిక విప్లవం: రాజ్నాథ్ సింగ్
యూపీలో ఇంత పారిశ్రామిక విప్లవం జరుగుతుందని పదేండ్ల క్రితం ఎవరూ ఊహించలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. లక్నోలోని పీటీసీ ఇండస్ట్రీస్కు చెందిన టైటానియం, సూపర్ అల్లాయ్మెటీరియల్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. యూపీ గడ్డపై ఈ ప్లాంట్ ప్రారంభోత్సవం జరగడం చాలా గొప్ప విషయం అని అన్నారు.