న్యూఢిల్లీ: గ్లోబల్ ట్రేడ్ సెటిల్మెంట్స్ ఇక నుంచి దేశ కరెన్సీలోనే జరిగేలా ఓ మెకానిజమ్ను తీసుకొచ్చామని రిజర్వ్ బ్యాంక్ సోమవారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో కొన్ని దేశాలతో జరిగే ట్రేడ్ సెటిల్మెంట్స్ను డైరెక్ట్గా రూపాయిలో జరుపుకోవడానికి దేశ కంపెనీలకు వీలుంటుంది. ఉదాహరణకు, ఉక్రెయిన్పై దాడి చేసినందుకు డాలర్లను రష్యా వాడుకోకుండా యూఎస్ ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా తెచ్చిన మెకానిజమ్తో దేశంలోని కంపెనీలు రష్యాతో ట్రేడింగ్ చేసుకొని, రూపాయిల్లోనే పేమెంట్ చేసుకోవడానికి వీలుంటుంది. వివిధ గ్లోబల్ అంశాలతో రూపాయి విలువ పడుతున్న విషయం తెలిసిందే. గ్లోబల్ ట్రేడ్ సెటిల్మెంట్లో రూపాయికి ప్రాధాన్యం ఇవ్వడంతో మన కరెన్సీ వాల్యూ పెరుగుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. రూపాయి ట్రేడ్ సెటిల్మెంట్స్ను జరిపే ముందు ఆథరైజ్డ్ బ్యాంకులు ఆర్బీఐ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.
రూపాయిల్లోనే ఎగుమతులు, దిగుమతుల లెక్క
కొత్త సెటిల్మెంట్ విధానం కింద ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ వాల్యూని రూపాయిల్లోనే లెక్కిస్తారు. ట్రేడ్ జరిగిన దేశ కరెన్సీ– రూపాయి ఎక్స్చేంజి రేటు లెక్కన ఇన్వాయిస్లు ఇష్యూ చేస్తారు. ఈ సెటిల్మెంట్స్ను అందించేందుకు ఆథరైజ్డ్ బ్యాంకులు ట్రేడింగ్ జరుపుతున్న పార్టనర్ బ్యాంకుల (ట్రేడ్ చేస్తున్న దేశాల్లోని బ్యాంకుల) కోసం స్పెషల్ రూపాయి వొస్ట్రో అకౌంట్స్ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీంతో రష్యా నుంచి ఇండియా దిగుమతులు చేసుకుంటే, ఈ దిగుమతుల విలువను రూపాయిల్లో ఆ దేశ బ్యాంక్ పార్టనర్ కోసం క్రియేట్ చేసిన అకౌంట్లో క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. అదే దేశ ఎగుమతిదారులు తమ ప్రొడక్ట్ల విలువను రూపాయిల్లో పొందుతారు. దేశ ఎగుమతిదారులు ఈ మెకానిజమ్ కింద అడ్వాన్స్లు కూడా రూపాయిల్లో పొందొచ్చు. స్పెషల్ వొస్ట్రో అకౌంట్స్లో మిగులు నిధులు ఉంటే ఆ డబ్బులను తీసుకొచ్చి గవర్నమెంట్ బాండ్లలో పెట్టడానికి వీలుంటుందని ఆర్బీఐ పేర్కొంది. ప్రస్తుతం ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ డాలర్ కింద జరుగుతున్నాయి. అంటే ఎగుమతి చేసిన ప్రొడక్ట్స్ వాల్యూని డాలర్లలో పొందడం, దిగుమతుల వాల్యూని డాలర్లలో చెల్లించడం
జరుగుతోంది.