- బ్యాంకుల్లో పనులు... ఇంకా ఈజీగా జరగాలె
- సిబ్బంది కస్టమర్లతో మర్యాదగా ఉండాలె
- బ్యాంకు ఉద్యోగులకు శిక్షణ ఇప్పించాలి
- కస్టమర్ సర్వీసును మరింత బలోపేతం చేయాలి
- యాజమాన్యాలకు సూచించిన ఆర్బీఐ
ముంబై: కస్టమర్ల సౌకర్యం కోసం బ్యాంకులు/ఆర్థిక సంస్థలు మరిన్ని కొత్త విధానాలను తీసుకురావాలని ఆర్బీఐ నియమించిన ప్యానెల్ సూచించింది. ఖాతాదారులు మరణిస్తే వాళ్ల వారసులు ఆన్లైన్లోనే డబ్బు పొందేలా చేయాలని, పెన్షనర్లు మరింత సులువుగా లైఫ్సర్టిఫికెట్లు అందజేసేలా చూడాలని సిఫార్సు చేసింది. సెంట్రలైజ్డ్ కేవైసీ డేటాబేస్ను తయారు చేసుకోవాలని కోరింది. బ్యాంకుల్లో సదుపాయాలను మెరుగుపర్చడానికి సంబంధిత కస్టమర్ సర్వీస్ స్టాండర్డ్స్లో తీసుకురావాల్సిన మార్పులను సూచించడానికి ఆర్బీఐ ఈ కమిటీని నియమించింది. గత ఏడాది మే నెలలో కమిటీ ఏర్పాటు కాగా, దీనికి సంస్థ మాజీ డిప్యూటీ గవర్నర్ బీపీ కానుంగో నాయకత్వం వహించారు. ఖాతాదారుల కేవైసీ పెండింగ్లో ఉన్నందున సేవలను నిలిపివేయకూడదని ఇది స్పష్టం చేసింది.
‘‘లోన్ల ఇబ్బందులను కూడా త్వరగా పరిష్కరించాలి. కస్టమర్ బాకీ పూర్తిగా చెల్లించాక ఆస్తి డాక్యుమెంట్లను వాపసు ఇవ్వడానికి ప్రస్తుతం చాలా సమయం పడుతోంది. ఇక నుంచి వీటిని తొందరగా ఇవ్వాలి. లేకపోతే సంబంధిత బ్యాంకుకు జరిమానా వేయాలి. బ్యారోవర్ ఆస్తి డాక్యుమెంట్లను బ్యాంకు పోగొడితే.. వాటిని బాధితుడు తిరిగి పొందడానికి సాయం చేయాలి. ఇందుకు అయ్యే ఖర్చులన్నింటినీ భరించడమేగాక కొంత మొత్తం పరిహారం చెల్లించాలి. ఎందుకంటే ఇలాంటి డాక్యుమెంట్ల కాపీలను సంపాదించాలంటే చాలా సమయం పడుతుంది”అని పేర్కొంది. ఆర్బీఐ రెగ్యులేటెడ్ ఎంటిటీల కోసం ఏర్పాటైన ఇంటర్నల్ గ్రీవెన్స్ రిడ్రెస్ (ఐజీఆర్) విధానం కింద గత మూడేళ్లలో వచ్చిన ఫిర్యాదులను ఈ కమిటీ పరిశీలించింది.
ఏడాదికి కోటి దాకా ఫిర్యాదులు అందుతున్నట్టు గుర్తించింది. లోన్ల విషయంలోనూ మరీ కఠినంగా ఉండొద్దని సూచించింది. జీతం ఖాతాలు ఉన్న వారి విషయంలో ఉదారంగా ఉండాలని, వారి ఆదాయం ఖర్చుల గురించి బ్యాంకులకు అవగాహన ఉంటుంది కాబట్టి ‘హైరిస్క్’ కేటగిరీలో చేర్చకూడదని సూచించింది. స్టూడెంట్స్ను కూడా ‘లో రిస్క్’ కేటగిరీలో చేర్చవచ్చని పేర్కొంది.
కామన్ కంప్లెయింట్ పోర్టల్
ఈ కమిటీ రిపోర్టు ప్రకారం.. ఫిర్యాదులను వేగంగా, సమర్థంగా పరిష్కరించేందుకు ఆర్బీఐ కామన్ కంప్లెయింట్ పోర్టల్ఏర్పాటు చేయాలి. ఇది అందుబాటులోకి వచ్చేలోపు బాధితుడు తన ఫిర్యాదు స్థితిని తెలుసుకునే విధానాన్ని తేవాలి. కస్టమర్లతో నేరుగా మాట్లాడే సిబ్బంది/అధికారులు కస్టమర్లతో దురుసుగా వ్యవహరించకుండా తగిన శిక్షణ ఇవ్వాలి. పెన్షనర్లు తనకు ఖాతా ఉన్న బ్యాంకుకు చెందిన ఏ బ్రాంచీలో లైఫ్సర్టిఫికెట్ ఇచ్చినా తీసుకోవాలి. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులు సహా అన్ని రెగ్యులేటెడ్ ఎంటిటీలలో (ఆర్ఈలు) కస్టమర్ సర్వీసును బలోపేతం చేయడానికి కమిటీ పలు సలహాలను సూచనలను సూచనలను ఇచ్చింది.