
- ఇండియా పోటీల చివరి రోజు ఆరు గోల్డ్ సహా 12 పతకాలు
- ఆర్చరీలో సురేఖ హ్యాట్రిక్ గోల్డ్
- సాత్విక్-చిరాగ్ జంటకు బంగారు పతకం
- నేడు ముగింపు వేడుకలు
హాంగ్జౌ: అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న ఇండియా ఆసియా గేమ్స్లో 28 గోల్డ్, 38 సిల్వర్, 41 బ్రాంజ్తో మొత్తం 107 మెడల్స్తో నాలుగో ప్లేస్ సాధించింది. ఆసియాలో తమ బెస్ట్ పెర్ఫామెన్స్ చేసి 2024 పారిస్ ఒలింపిక్స్కు ముందు కాన్ఫిడెన్స్ పెంచుకుంది. శనివారం జరిగిన పోటీల్లో ఇండియా డజను మెడల్స్ సాధించగా.. తెలుగు ఆటగాళ్లు తమ మార్కు చూపెట్టారు. ఆర్చరీలో ఇప్పటికే రెండు గోల్డ్ మెడల్స్ నెగ్గిన ఏపీ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మూడో గోల్డ్తో హ్యాట్రిక్ సాధించింది.
విమెన్స్ కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో సురేఖ 149–145 స్కోరుతో సౌత్ కొరియాకు చెందిన చవొన్ సోను ఓడించింది. బ్రాంజ్ మెడల్ మ్యాచ్లో ఇండియాకు చెందిన యంగ్ ఆర్చర్ ఆదితి స్వామి 146–140తో జిలిజతి (ఇండోనేసియా)పై గెలిచింది. మెన్స్ కాంపౌండ్లో ఓజాస్ దియోతలే వ్యక్తిగత విభాగంలో స్వర్ణంతో హ్యాట్రిక్ సాధించాడు. ఫైనల్లో అతను 149–147తో ఇండియాకే చెందిన అభిషేక్ శర్మను ఓడించాడు. అభిషేక్ సిల్వర్ ఖాతాలో వేసుకున్నాడు. మెగా గేమ్స్ ఆదివారం ముగియనున్నాయి. ఆఖరి రోజు జరిగే రెండు ఈవెంట్లలో ఇండియా అథ్లెట్లు పోటీ పడటం లేదు.
బ్యాడ్మింటన్లో తొలి గోల్డ్
డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్–చిరాగ్ ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్లో ఇండియాకు తొలి గోల్డ్ అందించి చరిత్ర సృష్టించారు. ఫైనల్లో మూడో ర్యాంకర్ సాత్విక్–చిరాగ్ 21–18, 21–16తో వరుస గేమ్స్లో 15 ర్యాంకర్ సౌత్ కొరియాకు చెందిన చోయి సోల్గ్యూ–కిమ్ వొన్హో జంటను ఓడించి చాంపియన్లుగా నిలిచారు. డబుల్స్లో 41 ఏండ్ల తర్వాత ఇండియాకు ఇదే తొలి మెడల్.
కబడ్డీలో డబుల్ ధమాకా
కబడ్డీలో ఇండియా తమ ఆధిపత్యాన్ని చూపెట్టింది. మెన్స్, విమెన్స్ కబడ్డీ టీమ్స్ గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకొని డబుల్ ధమాకా మోగించాయి. హోరాహోరీగా జరిగిన విమెన్స్ ఫైనల్లో 26–25తో చైనీస్ తైపీని ఓడించిన విమెన్స్ టీమ్ ఇండియా ఖాతాలో వందో మెడల్ చేర్చింది. విమెన్స్ కబడ్డీలో మన టీమ్కు ఇది మూడో గోల్డ్. మరోవైపు వివాదాస్పదమైన మెన్స్ ఫైనల్లో ఇండియా 33–29తో ఇరాన్ను ఓడించి విజేతగా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో మరో 65 సెకండ్ల టైమ్ మిగిలుండగా ఇరు జట్లూ 28–28తో నిలిచాయి. ఈ టైమ్లో డూ ఆర్ డై రైడ్కు వెళ్లిన ఇండియా కెప్టెన్ పవన్ సెహ్రావత్ డిఫెండర్లను టచ్ చేయకుండా లాబీలో అడుగు పెట్టాడు.
నలుగురు ఇరాన్ డిఫెండర్లు కూడా లాబీలోకి వచ్చి అతడిని బయటకు పుష్ చేసే ప్రయత్నం చేశారు. దాంతో, పవన్ను వాళ్లు సక్సెస్ఫుల్గా ట్యాకిల్ చేశారా? లేదా?. ఇందులో పాత రూల్ను పాటించాలా? కొత్త రూల్ను పాటించాలా? అనే విషయాల్లో స్పష్టత లేకపోయింది. కొత్త రూల్ ప్రకారం సెహ్రావత్తో పాటులాబీలోకి వచ్చిన నలుగురు డిఫెండర్లు కూడా ఔట్ అవుతారు. దాంతో ఇండియాకు నాలుగు, ఇరాన్కు ఓ పాయింట్ వస్తుంది. మ్యాచ్ అధికారులు తొలుత చెరో పాయింట్ ఇచ్చారు. దీనికి నిరసనగా మ్యాట్పై బైఠాయించిన ఇండియన్స్ రివ్యూ కోరారు. గంటపాటు గందరగోళం నెలకొనడంతో మ్యాచ్ను కాసేపు సస్పెండ్ చేసిన అధికారులు ఇండియాకే నాలుగు పాయింట్లు ఇచ్చారు. ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత పవన్ బోనస్ పాయింట్ తెచ్చాడు. ఆసియా గేమ్స్లో ఇండియా మెన్స్ టీమ్కు ఇది ఎనిమిదో మెడల్.
రుతురాజ్ సేనకు స్వర్ణం
క్రికెట్లో విమెన్స్తో పాటు మెన్స్ క్రికెట్ టీమ్ కూడా గోల్డ్ గెలిచింది. ఇండియా, అఫ్గానిస్తాన్ మధ్య ఫైనల్ వాన కారణంగా అర్ధంతరంగా ముగిసింది. దాంతో హయ్యెస్ట్ సీడింగ్ ఉన్న రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలోని ఇండియాను విన్నర్గా డిక్లేర్ చేశారు. మొదట బ్యాటింగ్కు దిగిన అఫ్గాన్ 18.2 ఓవర్లలో 112/5 స్కోరుతో నిలిచిన టైమ్లో భారీ వానతో ఆట ఆగిపోయింది. గోల్డ్ నెగ్గిన ఇండియా టీమ్లో హైదరాబాదీ తిలక్ వర్మ ఉన్నాడు.
చెస్లో వెండి వెలుగులు
చెస్లో ఇండియా మెన్స్, విమెన్స్ టీమ్స్ సిల్వర్ మెడల్స్ సాధించాయి. తెలంగాణ ప్లేయర్ ఎరిగైసి అర్జున్, ఏపీ ఆటగాడు పి. హరికృష్ణ, ప్రజ్ఞానంద, విదిత్ సంతోష్తో కూడిన మెన్స్ టీమ్ 9 రౌండ్ల తర్వాత 7.5 పాయింట్లతో రెండో ప్లేస్తో సిల్వర్ గెలిచింది. ఇరాన్ గోల్డ్ సొంతం చేసుకుంది. హారిక, వైశాలి, వంతిక, సవితశ్రీతో కూడిన విమెన్స్ టీమ్ 9 రౌండ్లలో 15 పాయింట్లతో సిల్వర్ గెలిచింది.
దీపక్కు సిల్వర్..
హాకీ అమ్మాయిలకు బ్రాంజ్
రెజ్లింగ్లో ఇండియా స్టార్ దీపక్ పునియా మెన్స్ 86 కేజీ ఫైనల్ బౌట్లో ఓడి సిల్వర్ సాధించాడు. విమెన్స్ హాకీ బ్రాంజ్ మెడల్ మ్యాచ్లో ఇండియా 2–1తో డిఫెండింగ్ చాంప్ జపాన్ను ఓడించి పతకం గెలిచింది. దీపిక (5వ ని), సుశీల చాను (50వ ని) చెరో గోల్ సాధించారు.
‘ఈసారి వంద పతకాలు’ అంటూ ఆసియా గేమ్స్లో బరిలోకి దిగిన ఇండియా మిషన్ సక్సెస్ అయింది. ఏషియాడ్ చరిత్రలో తొలిసారి మన దేశం వంద మెడల్స్ను దాటి కొత్త చరిత్ర సృష్టించింది. మొత్తంగా 107 మెడల్స్తో ఈ మెగా ఈవెంట్ను ముగించింది. తమ పోటీలు ముగిసిన శనివారం ఏకంగా ఆరు గోల్డ్ సహా డజను మెడల్స్తో అదిరిపోయే ఫినిషింగ్ టచ్ ఇచ్చింది.