
‘భారత్ శత్రుదుర్భేద్యమని మన సైనికులు పాక్కు చాటి చెప్పారు.. కార్గిల్విజయమే దీనికి ఉదాహరణ’ అని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. కార్గిల్యుద్ధం జరిగి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో కార్గిల్ విజయ్దివస్ ముగింపు కార్యక్రమంఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాజ్నాథ్సింగ్తో కలిసి ప్రధాని పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అమరవీరుల కుటుంబ సభ్యులు నాటి సంఘటనలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధాని మోడీ అమరవీరులకు అంజలి ఘటించిన తర్వాత సభలో మాట్లాడుతూ ‘కార్గిల్ వార్లో గెలుపొందాక మన సైనికులు మంచుకొండల్లో మువ్వన్నెల జెండా ఎగరవేశారని చెప్పారు. కార్గిల్లో పోరాడిన సైనికులు నిజమైన యుద్ధవీరులని అన్నారు. యుద్ధం ప్రభుత్వాల మధ్య కాదు.. దేశాల మధ్య జరుగుతుందన్నారు. కార్గిల్విజయం ఇప్పటికీ దేశ పౌరులలో స్ఫూర్తి నింపుతూనే ఉందని చెప్పారు. అది దేశంలోని ప్రతీ పౌరుడి విజయం’ అని చెప్పారు. కార్గిల్లో కొంతభాగాన్ని ఆక్రమించుకుని కొత్త సరిహద్దులను ఏర్పాటు చేయాలన్నది పాకిస్తాన్ ప్రయత్నమని చెప్పారు. దీనికోసం 1999లో పాక్సైన్యం విఫలయత్నం చేసిందన్నారు. అయితే, పాక్దురాలోచనను సైన్యం తిప్పికొట్టిందని, చొచుకొచ్చిన శత్రువును బోర్డర్అవతలికి తరిమి కొట్టిందని మోడీ చెప్పారు. కార్గిల్యుద్ధం కొనసాగుతుండగానే తాను అక్కడికి వెళ్లినట్లు ప్రధాని చెప్పారు. అది తనకో తీర్థయాత్రలాంటిదన్నారు. సైనికులు నేలకొరిగిన చోటు పుణ్యక్షేత్రాలేనని, సైనికులే నిజమైన హీరోలని అన్నారు. ‘దేశం భద్రంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, జాతీయ భద్రత విషయంలో ఏ ఒత్తిడికీ తలొగ్గమని స్పష్టం చేశారు. సైనిక బలగాల ఆధునికీకరణకు ప్రాధాన్యమిస్తున్నామని మోడీ చెప్పారు.