న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరో ఘనతను సొంతం చేసుకుంది. మనదేశంలోనే అత్యధికంగా సంపద సృష్టించిన కంపెనీగా గుర్తింపు పొందింది. ఇది 2018 నుంచి 2023 వరకు ఐదేళ్ల కాలంలో అతిపెద్ద సంపద సృష్టికర్తగా ఎదిగింది. అదానీ ఎంటర్ప్రైజెస్ భారీ, వేగంగా ఎదిగిన, స్థిరమైన (టాప్ ఆల్రౌండర్) కంపెనీగా నిలిచిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టడీ వెల్లడించింది.
కంపెనీల స్టాక్ మార్కెట్ పనితీరు ఆధారంగా జరిపిన ఈ అధ్యయనంలో వరుసగా ఐదవ సారి రిలయన్స్ అతిపెద్ద సంపద సృష్టికర్తగా అవతరించింది. 2018–-23లో ఇది రూ.9,63,800 కోట్ల సంపదను సృష్టించింది. ఆ తర్వాతి స్థానాల్లో టీసీఎస్ (రూ. 6,77,400 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్ (రూ. 4,15,500 కోట్లు), ఇన్ఫోసిస్ (రూ. 3,61,800 కోట్లు), భారతీ ఎయిర్టెల్ (రూ. 2,80,800 కోట్లు) ఉన్నాయి. లాయిడ్స్ మెటల్స్ 2018–23 మధ్య 79 శాతం సీఏజీఆర్తో అత్యంత వేగవంతమైన సంపద సృష్టికర్తగా రికార్డులకు ఎక్కింది.
అదానీ 78 శాతం సీఏజీఆర్ సాధించింది. టాప్ 10 సంపద సృష్టికర్తలలో 2018లో పెట్టుబడి పెట్టిన రూ. 10 లక్షల విలువ 2023లో రూ. కోటి అవుతుంది. ఇది 59 శాతం రిటర్న్ సీఏజీఆర్కు సమానం. కాప్రి గ్లోబల్ అత్యంత స్థిరమైన సంపద సృష్టికర్తగా ఘనతను దక్కించుకుంది. ఇది గత ఐదేళ్లలో బీఎస్ఈ సెన్సెక్స్ను అధిగమించింది.
ఏకంగా50 శాతం సీఏజీఆర్ను సాధించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ అత్యుత్తమ ఆల్ రౌండ్ వెల్త్ క్రియేటర్గా రికార్డు సృష్టించింది. ఇది 9వ అతిపెద్ద సంపద సృష్టికర్త. రెండవ వేగవంతమైన కంపెనీగా, ఐదవ అత్యంత స్థిరమైన కంపెనీగా ఎదిగింది. ఆ తర్వాత వరుణ్ బెవరేజెస్, అదానీ పవర్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నాయి.
మొత్తం రూ.70 లక్షల కోట్లు
2018-–23లో ఇండియాలోని టాప్ 100 సంపద సృష్టికర్తలు రూ. 70.5 లక్షల కోట్ల సంపదను సృష్టించారు. ఇది మునుపటి 5 సంవత్సరాల కాలం 2017-–22 (రూ. 92.2 లక్షల కోట్లు) కంటే చాలా తక్కువ. సంపద సృష్టి వేగం 21 శాతం సీఏజీఆర్ వద్ద ఉంది. మునుపటి 5 సంవత్సరాల కాలంలో (28 శాతం) కంటే కూడా తక్కువగా ఉంది. కానీ బీఎస్ఈ సెన్సెక్స్ రాబడి 12 శాతం కంటే చాలా ఎక్కువ.
వరుసగా ఐదవసారి అతిపెద్ద సంపద సృష్టికర్తగా రిలయన్స్ గుర్తింపు పొందింది. టీసీఎస్, ఇన్ఫోసిస్ ప్రతిఏటా టాప్ –5 సంపద సృష్టికర్తలలో ఉన్నాయి. చాలా సంవత్సరాల తరువాత మొదటిసారిగా సంపద సృష్టికర్తల టాప్–10 జాబితాలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కనిపించలేదు. కన్జూమర్, రిటైల్ ఫైనాన్షియల్ల కంటే టెక్నాలజీ రంగం వరుసగా రెండవ సంవత్సరం కూడా అతిపెద్ద సంపదను సృష్టించే రంగంగా ఎదిగింది.
సంపద సృష్టిలో టెక్నాలజీ 20 శాతం వాటాను దక్కించుకుంది. రసాయనాలు/ఎరువులు రంగం నుంచి మూడు శాతం సంపద వచ్చింది. అత్యధికంగా నష్టపోయిన వాటిలో సెన్సిటివ్ ఫైనాన్షియల్స్, ఆటో రంగాలు ఉన్నాయి. 2018–23లో పీఎస్యూల (పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లు) సంపద సృష్టి పనితీరు గత రెండు అధ్యయనాల కంటే పెరిగింది. ఏడు పీఎస్యూలు ఆరు శాతం సంపదను సృష్టించాయి.