- ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ప్రదర్శించిన కంపెనీ
- వచ్చే నెల నుంచే వన్ వెబ్ సర్వీస్లు అంటున్న ఎయిర్టెల్
న్యూఢిల్లీ: శాటిలైట్ ఆధారంగా హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్లను అందించే గిగా ఫైబర్ సర్వీస్లను రిలయన్స్ జియో శుక్రవారం ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ప్రదర్శించింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీకి జియోస్పేస్ ఫైబర్, ఇతర సర్వీస్లు, ప్రొడక్ట్ల గురించి జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ వివరించారు. తక్కువ ధరల్లోనే తమ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్లు అందుబాటులోకి వస్తాయని ఆకాశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని 45 కోట్ల మంది కస్టమర్లకు హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ (ఫిక్స్డ్ లైన్), వైర్లెస్ సర్వీస్లను జియో అందిస్తోంది.
తమ శాటిలైట్ నెట్వర్క్ వైర్లెస్ సర్వీస్లకు సపోర్ట్ చేస్తుందని, దేశంలో మారుమూల ప్రాంతాలకు కూడా 5జీ సేవలను విస్తరిస్తామని వెల్లడించింది. శాటిలైట్ బేస్డ్ సర్వీస్లను అందించేందుకు ఎస్ఈఎస్తో జియో పార్టనర్షిప్ కుదుర్చుకుంది. జియోస్పేస్ ఫైబర్ను ప్రదర్శించేందుకు మారుమూల ప్రాంతాలైన గిర్ ( గుజరాత్), కోర్బా ( ఛత్తీస్గఢ్) , నబరంగపుర్ (ఒడిసా) , ఓఎన్జీసీ– జోర్హట్ (అస్సాం) లకు శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీస్లను జియో అందించింది.
ఎయిర్టెల్ కూడా రెడీ!
జియో పోటీ కంపెనీ ఎయిర్టెల్ కూడా శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్లను అందించేందుకు సిద్ధమయ్యింది. వన్వెబ్ శాటిలైట్ కమ్యూనికేషన్ వచ్చే నెల నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు సర్వీస్లు అందిస్తుందని ఎయిర్టెల్ చైర్మన్ సునిల్ భారతి మిట్టల్ పేర్కొన్నారు.